నేవీ నౌక మునక: నావికుడి మృతి, 4గురు గల్లంతు
విశాఖపట్నం/న్యూఢిల్లీ: భారత తూర్పు నౌకాదళానికి చెందిన టోర్పడో రికవరీ నౌక గురువారం విశాఖ తీరంలో మునిగిపోయింది. ఈ ఘటనలో ఓ నావికుడు మరణించగా మరో నలుగురు గల్లంతయ్యారు. ఇక్కడ జరుగుతున్న నౌకా విన్యాసాల సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది.
గురువారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో నౌకలో 28మంది ఉన్నారు. ఇరవై మూడు మందిని రక్షించగలిగామని, మిగిలిన నలుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టామని తూర్పు నౌకాదళ అధికార వర్గాలు తెలిపాయి.
‘తొర్పెడో రికవరీ వెహికిల్-72'(టిఆర్వి)గా పేర్కొనే ఈ చిన్న నౌకను యుద్ధ నౌకల నుంచి ప్రయోగాత్మకంగా పేల్చిన టోర్పెడోలను తిరిగి సేకరించడానికి ఉపయోగిస్తారు. గురువారం రాత్రి 7.30గంటలకు అది విశాఖ హార్బర్కి చేరుకోవాల్సి ఉంది. అయితే ప్రమాదవశాత్తు ఇందులోని ఓ భాగంలోకి నీరు చేరడంతో నౌక మునిగిపోయిందని నౌకాదళ వర్గాలు వెల్లడించాయి.
విశాఖ నగరానికి దక్షిణంగా 35 నాటికల్ మైళ్ల దూరంలో, విశాఖ తీరం నుంచి ఖచ్చితంగా 28 నాటికల్ మైళ్ల దూరంలో మునిగిపోయి సముద్ర అడుగుభాగంలో 370 మీటర్ల లోతుకు చేరింది. గురువారం సాయంత్రం 6.30గంటల సమయంలో స్టీరింగ్ కంపార్ట్మెంట్లోకి నీళ్లు రావడం మొదలై ప్రమాదం సంభవించింది.
నౌక మునుగుతుందని గుర్తించిన అందులోని సిబ్బంది నౌకాదళ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అందులోని లైఫ్ జాకెట్లు, చిన్నపాటి బోట్లతో బయటకు వచ్చేశారు. నౌకాదళ అధికారులు దగ్గరలోని నౌకల్ని, హెలికాప్టర్లను మునుగుతున్న నౌక దగ్గరికి పంపి 24మందిని రక్షించారు.
రాత్రి సమయంలో సైతం ప్రయాణించగల సీకింగ్ 42సి హెలికాప్టర్ను పంపి మిగిలిన నలుగురి కోసం గాలింపులు జరుపుతున్నారు. అయితే రక్షించిన వారిలో ఒకరు మృత్యువాత పడినట్లు అధికారులు ప్రకటించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై నౌకాదళం ‘బోర్డ్ ఆఫ్ ఎంక్వైరీ'ని ఆదేశించింది. 23 మీటర్ల పొడుగు, 6.5మీటర్ల వెడల్పు కలిగిన ఈ నౌకను 1983లో గోవా షిప్యార్డ్ నిర్మించింది.