ఓయుపై నాయిని వివరణ, ఏపీకి వెళ్లిన కంపెనీపై డీకే
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులను అవమానించేలా తాను ఎప్పుడు కూడా మాట్లాడలేదని, తన పైన నిరసన వెనుక రాజకీయ కుట్ర ఉందని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి శుక్రవారం అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొన్న ఓయు విద్యార్థులకు తాను సెల్యూట్ చేస్తున్నానని వ్యాఖ్యానించారు.
ఎన్నికలకు ముందు కేసీఆర్ డౌన్ డౌన్ అన్నవారే ఇప్పుడు కూడా ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు. ఆందోళన చేస్తున్న వారుం అందరు కూడా ఉద్యమంలో పాల్గొన్నారో లేదో తనకు తెలియదని నాయిని చెప్పారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎన్నికల ప్రచారంలోనే ఒప్పంద ఉద్యోగులకు కొన్ని హామీలు ఇచ్చారని చెప్పారు. గత ప్రభుత్వ పాలకులు ఒప్పంద ఉద్యోగులకు ఎంతో అన్యాయం చేశారన్నారు.

ప్రజలకు చేసిందేమీ లేదు: డికె అరుణ
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సాధించిన పరిశ్రమలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఘనతగా చెప్పుకుంటున్నారని కాంగ్రెస్ నేత డీకె అరుణ మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడారు. మహబూబ్నగర్లో కేసీఆర్ ప్రారంభించిన పరిశ్రమలన్నీ కాంగ్రెస్ హయాంలోనివేనని ఆమె అన్నారు. ఇందులో టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పతనం ఏమీ లేదన్నారు. ప్రజలకు చేసింది అంతకంటే ఏమీ లేదన్నారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి హీరో మోటార్, మహింద్రా పక్క రాష్ట్రాలకు తరలిపోతుంటే కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. పరిశ్రమల ఏర్పాటులో మహబూబ్నగర్ జిల్లాకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నప్పుడు కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం తానే తెచ్చానని చెప్పుకోవడం కేసీఆర్ ఇకనైనా మానుకోవాలన్నారు కాగా, హీరో మోటార్ ఏపీకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications