మోడీ సభలో భద్రతా వైఫల్యాలు..ఈసీకి ఎన్డీయే ఫిర్యాదు..!
ఏపీలో నిన్న పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ప్రధాని మోడీ హాజరైన బీజేపీ, టీడీపీ, జనసేన తొలి ఉమ్మడి సభలో ఎక్కడి కక్కడ భద్రతా లోపాలు కనిపించాయి. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్న సమయంలోనే లైటింగ్ టవర్స్ పై జనం ఎక్కేయడం, మైక్ సెట్ మీదకు పడిపోయి అది పనిచేయకుండా ఆగిపోవడం వంటి ఘటనలు కనిపించాయి. దీనిపై స్వయంగా ప్రధాని మోడీ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దీనిపై కేంద్ర నిఘా వర్గాలు దృష్టిసారించాయి.
అదే సమయంలో రాష్ట్రంలో ఎన్డీయేలో భాగమైన బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు ఇవాళ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాను కలిసి ప్రధాని సభలో భద్రతా లోపాలపై ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే పోలీసులు భద్రతను గాలికొదిలేశారని వారు ఆరోపించారు. ఈ మేరకు ప్రధాని సభలో చోటు చేసుకున్న భద్రతా ఉల్లంఘనలపై వివరంగా సీఈవోకు వారు ఫిర్యాదు చేశారు. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

రాష్ట్రంలో ప్రధాని పర్యటనకు సంబంధించిన షెడ్యూల్, ఇతర వివరాలను ముందుగానే అందజేసినా పోలీసులు భద్రత కల్పించడంలో విఫలమయ్యారని ఫిర్యాదులో ఎన్డీయే నేతలు తెలిపారు. ప్రధాని వంటి వీవీఐపీ హాజరైన సభలో పోలీసులు స్ధాయికి తగినట్లు భద్రత కల్పించలేకపోయారని వెల్లడించారు. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి భద్రతా ఉల్లంఘనలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవడంతో పాటు పల్నాడు సభలో ఘటనలపై విచారణ చేయించాలని వారు కోరారు.
ప్రధాని పాల్గొన్న ప్రజాగళం సభకు ట్రాఫిక్ ను నియంత్రించలేదని, పల్నాడు ఎస్పీ వైసీపీ కార్యకర్తలా పనిచేశారని ఫిర్యాదులో తెలిపారు. అలాగే నలుగురు పోలీసు అధికారులపై ప్రత్యేకంగా ఫిర్యాదు చేశారు. వీరిని విధుల్లో కొనసాగిస్తే ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం తమకు లేదన్నారు. కాబట్టి వీరిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు.












Click it and Unblock the Notifications