Nellimarla assembly roundup: నెల్లిమర్లలో నువ్వా నేనా? హోరాహోరీగా వైసీపీ, జనసేన అభ్యర్థుల ప్రచారం!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు షెడ్యూల్ వచ్చింది. ఈ క్రమంలో అన్ని రాజకీయపార్టీలు ఎన్నికల ప్రచారంలో దూకుడును పెంచాయి. ఓవైపు జగన్ సిద్ధం సభలతో మోత పుట్టిస్తుంటే, మరోవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బిజెపి నేతలతో కలిసి మూకుమ్మడిగా జగన్ పై దాడి చేస్తున్నారు. టిడిపి, బిజెపి, జనసేన పార్టీలు ఉమ్మడిగా పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగడంతో, కూటమి తరపున ఎన్నికల ప్రచారం చేయడానికి ప్రధాని నరేంద్రమోడీ కూడా ఏపీలో పర్యటిస్తున్నారు.
ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికలకు వెళుతున్న అన్ని పార్టీల నేతలు ప్రచారంలో దూకుడుగా ముందుకు వెళుతున్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం లో వైసిపి, జనసేన నేతలు పోటాపోటీగా ప్రచార పర్వాన్ని సాగిస్తున్నారు.విజయనగరం జిల్లాలో జనసేన పోటీ చేస్తున్న ఏకైక నియోజకవర్గం నెల్లిమర్ల నియోజకవర్గం.

ఈ నియోజకవర్గాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న టిడిపి, బిజెపి, జనసేన కూటమి ఇక్కడి నుంచి లోకం మాధవిని బరిలోకి దింపారు. తొలి జాబితాలోని సీటు దక్కించుకున్న లోకం మాధవి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి నెల్లిమర్ల అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గం నుండి బి. అప్పలనాయుడు ఎన్నికల బరిలోకి దిగారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బి అప్పలనాయుడు మరోమారు ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పలనాయుడు ఇప్పటికే ఈ నియోజకవర్గం నుండి రెండు మార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించగా, ప్రస్తుతం జగన్ సంక్షేమ మంత్రం తనను గెలిపిస్తుంది అన్న ధీమాతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు. మరోవైపు లోకం మాధవి కూడా బిజెపి, టిడిపి నేతల మద్దతుతో ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తూ అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండ కడుతున్నారు.
అయితే ఇరువురు నేతలకు అంతర్గత కుమ్ములాటలు మైనస్ కాగా, ఆర్థికంగా ఇరువురు నేతలు చాలా బలమైన నేతలు కావడం ప్లస్ గా చెబుతున్నారు. మరి నెల్లిమర్లలో నువ్వా నేనా అన్నట్టు సాగుతున్న ఎన్నికల పోరులో ఎవరు విజయం సాధిస్తారు అనేది మరికొంత కాలంలో తేలనుంది.












Click it and Unblock the Notifications