వైసీపీకి ఎమ్మెల్యే కోటంరెడ్డి గుడ్ బై ? ఇన్ ఛార్జ్ రెడీ చేసుకుంటున్న జగన్ !
ఏపీలో వైసీపీ 100 శాతం సీట్లు గెల్చుకున్న జిల్లాల్లో ఒకటైన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధిష్టానంపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇవాళ ఆయన వైసీపీని వీడే అవకాశముంది.
నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సీఎం జగన్ కు భారీ షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిని దూరం చేసుకున్న వైసీపీకి ఇప్పుడు కోటంరెడ్డి రూపంలో మరో షాక్ తగలబోతున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉన్న కోటంరెడ్డి ఇవాళ పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలున్నట్లు సమాచారం.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సొంత పార్టీ వైసీపీపై కొంతకాలంగా అసంతృప్తిగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే అయిన తనను కాదని ఇప్పటికే జిల్లాలో ముగ్గురికి మంత్రి పదవులు కట్టబెట్టిన సీఎం జగన్ తీరుపైనే కోటంరెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. పలు సందర్భాల్లో ప్రభుత్వ అధికారుల తీరుపై విమర్శలుప గుప్పించడం, స్ధానికంగా తానే స్వయంగా రంగంలోకి దిగి పనులు చేస్తూ కనిపించడంతో తాజాగా ఆయన అసంతృప్తిని గమనించిన జగన్.. పిలిపించుకుని మాట్లాడారు. అయినా ఆయన సంతృప్తి చెందలేదు. దీంతో ఆయన పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
వైసీపీకి కోటంరెడ్డి గుడ్ బై ?
నెల్లూరు రూరల్ నియోజకవర్గంతో పాటు జిల్లాలోనూ తన మాట చెల్లుబాటు కావడం లేదని కోటంరెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. ఇదే విషయాన్ని పలుమార్లు అధిష్టానం దృష్టికీ, రీజనల్ ఇన్ ఛార్జ్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా తనకు న్యాయం జరగలేదని, ముఖ్యంగా మంత్రి పదవి ఇస్తామని ఊరించి జగన్ పట్టించుకోలేదన్న ఆక్రోశం కోటంరెడ్డిలో కనిపిస్తోంది. దీంతో పార్టీలో ఉంటూ అవమానాలు ఎదుర్కోవడం కంటే రాజీనామా చేస్తేనే బెటర్ అన్న అంచనాకు కోటంరెడ్డి వచ్చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత జరగబోయే పరిణామాల్ని కూడా అంచనా వేసుకుంటున్న కోటంరెడ్డి ఆచిచూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. నిన్నంతా ఆఫీసులో అనుచరులతో వరుస భేటీలు నిర్వహించిన కోటంరెడ్డి నిర్ణయం మాత్రం ప్రకటించలేదు. దీంతో ఇవాళ కీలక నిర్ణయం వెలువడొచ్చని భావిస్తున్నారు.
వైసీపీ సంప్రదింపులు
నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డి విషయంలో ఎప్పుడూ జగన్ సానుకూలంగా లేరు. కానీ ఇప్పుడున్న పరిస్ధితుల్లో ఒకే జిల్లా నుంచి రెండో ఎమ్మెల్యే తిరుగుబాటు బావుటా ఎగురవేస్తే, రాజీనామా వరకూ వెళితే కచ్చితంగా ఆ ప్రభావం చుట్టుపక్కన జిల్లాలపైనా పడుతుందని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే కోటంరెడ్డిని తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని ఫోన్లు చేయడంతో పాటు దూతల్ని కూడా పంపుతున్నట్లు సమాచారం. అయితే కోటంరెడ్డి మాత్రం తాను వైసీపీలో కొనసాగలేనని వారికి స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చని చెప్తున్నారు.
ఇన్ ఛార్జ్ రెడీ చేసిన జగన్ ?
నెల్లూరు రూరల్ స్ధానంలో కోటంరెడ్డి రాజీనామా చేసినా లేక ఆనం రామనారాయణ రెడ్డి తరహాలో తిరుగుబాటు బావుటా ఎగురవేసినా సంసిద్ధంగా ఉండాలని సీఎం జగన్ నెల్లూరు వైసీపీ నేతలకు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కోటంరెడ్డి స్ధానంలో ఇన్ ఛార్జ్ గా ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి కానీ లేక ఆనం విజయ్ కుమార్ రెడ్డిని కానీ నియమించేందుకు రంగం సిద్ధమైనట్లు చెప్తున్నారు. అయితే కోటంరెడ్డి చివరి నిమిషంలో వెనక్కి తగ్గితే సరి, లేకుంటే ఇన్ ఛార్జ్ నియామకం ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఒకే జిల్లాలో రెండో వైసీపీ ఎమ్మెల్యే స్ధానంలో వైసీపీ ఇన్ ఛార్జ్ ను నియమించినట్లు అవుతుంది.