వైసీపీ అయితే లక్ష-టీడీపీకి 2 లక్షలు అంటున్న కోటంరెడ్డి.. !
ఏపీలో విలక్షణ రాజకీయ నేతల్లో ఒకరైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకుంటుంటారు. ఏ పార్టీలో ఉన్నామనేది కాదు ఎంత నిక్కచ్చిగా ఉన్నామనేది ముఖ్యం అంటారు కోటంరెడ్డి. ఇందుకోసం తనను నమ్ముకున్న వారినైనా లెక్కచేయని తత్వం ఆయనది. ఇదే క్రమంలో తాజాగా ఆయన ఇచ్చిన వార్నింగ్ ఒకటి తన రాజకీయ ప్రత్యర్ధులకే కాదు, తనతో పాటు ప్రయాణం చేస్తున్న సొంత పార్టీ నేతలకూ షాకిచ్చింది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. రాష్ట్రంలో కొత్తగా పగ్గాలు చేపట్టిన కూటమి ప్రభుత్వం ఇసుక అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఇసుక, మట్టి అక్రమాలు పతాకస్ధాయికి చేరాయని భావిస్తున్న సీఎం చంద్రబాబు.. మళ్లీ తమ ప్రభుత్వంలో అలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కేబినెట్లో మంత్రులకు సైతం పదే పదే ఇసుక విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేస్తున్నారు. తాజాగా టీడీపీ పొలిట్ బ్యూరో భేటీలోనూ నేతల్ని మరోసారి చంద్రబాబు ఇదే విషయంలో హెచ్చరించారు. దీని ప్రభావమో ఏమో తెలియదు కానీ కోటంరెడ్డి కూడా తనదైన శైలిలో ఇసుక నేతలకు వార్నింగ్ ఇచ్చారు.

తన నియోజకవర్గం నెల్లూరు రూరల్ పరిధిలో ఇసుక తవ్వకాల్లో జోక్యం చేసుకుంటే ఏ పార్టీ నాయకుడు అనేది చూడనని, ఎవరికైనా జరిమానాలు తప్పవని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు. అంతే కాదు వైసీపీ నేతలతే లక్ష జరిమానా వేస్తానని, అదే అధికార టీడీపీ నాయకులైతే రెండు లక్షలు జరిమానా వేస్తానని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే తన పేరు అక్రమ వ్యవహారాల్లో వాడుకుంటే ఏకంగా 10 లక్షలు జరిమానా వేస్తానని కోటంరెడ్డి హెచ్చరించారట. దీంతో ఇప్పుడు కోటంరెడ్డి వ్యవహారశైలి చర్చనీయాంశమవుతోంది. ఆయన గురించి తెలిసిన వారు మాత్రం కోటంరెడ్డి హెచ్చరికల్ని స్వాగతిస్తున్నారు.












Click it and Unblock the Notifications