వైఎస్ ఓకే!... జగన్ నాట్ ఓకే!: 'వైసీపీలో చేరి చాలా పెద్ద తప్పు చేశా'
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్కి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. వైసీపీ గుర్తుతో గెలిచి టీడీపీలోకి చేరిన బొబ్బలి ఎమ్మెల్యే సుజయకృష్ణా రంగారావు లాంటి సీనియర్ నేతలు జగన్పై ఎలాంటి ఆరోపణలు చేయనప్పిటికీ, కొందకు ఎమ్మెల్యేలు జగన్పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
పార్టీ మారిన అనంతరం బొబ్బలి ఎమ్మెల్యే సుజయ మాత్రం వైయస్ జగన్కు మంచి గుర్తింపే ఇచ్చారని, అయితే నియోజకవర్గ పరిస్థితుల కారణంగా తాము పార్టీ మారాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. అయితే ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి చేరుతున్న ఎమ్మెల్యేలు జగన్ ప్రవర్తన తీరు నచ్చకే పార్టీ మారుతున్నట్లు బహిరంగగానే విమర్శలు చేస్తున్నారు.
తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైసీపీ జిల్లా సమన్వయకర్తగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే టీడీపీలో చేరతానని ఆయన ప్రకటించారు. ఈ మేరకు సోమవారం నెల్లూరులో మీడియా సమావేశం పెట్టి మరీ వేమిరెడ్డి తన నిర్ణయాన్ని వెల్లడించారు.
ఈ సందర్భంగా వైయస్ జగన్ వైఖరిపై వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. వైసీపీలో చేరి తాను తప్పు చేశానని ఆయన అన్నారు. దివంగత వైయస్ రాజశేఖరరెడ్డికి ఆయన కొడుకు జగన్కు అసలు పోలికే లేదన్నారు. 'వైఎస్ ఓకే... జగన్ నాట్ ఓకే'' అంటూ పేర్కొన్న వేమిరెడ్డి జగన్ వైఖరి కారణంగానే ఆ పార్టీలో తాను ఎందుకు చేరానా? అని బాధపడుతున్నానని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో త్వరలో టీడీపీలో చేరతానని స్పష్టం చేశారు. తన ఆలోచనా విధానానికి, వైసీపీ విధానాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు. నవ్యాంధ్ర అభివృద్ధికి, రాజధాని అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు చేస్తున్న కృషి, కష్టం తనను ఎంతగానో ఆకర్షించాయన్నారు.
ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలాన్ని సృష్టించాయి. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరాలనుకునే వారు వైయస్ జగన్పై ఆరోపణలు చేయడం పరిపాటిగా మారింది. ఇది ఇలా ఉంటే వైసీపీ నుంచి ఇప్పటి వరకు 13 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులతో పాటు కీలక నేతలు కూడా జగన్కు దూరం జరుగుతుండటం గమనార్హం.