బాబు ప్రసంగంలో పెద్ద పొరపాటు: నెటిజన్ల సైటైర్లు మామూలుగా లేవు!
హైదరాబాద్/తిరుపతి: రాజకీయ నేతల ప్రసంగాల్లో అప్పుడప్పుడు తప్పులు, పొరబాట్లు దొర్లడం సహజమే. ఆ తప్పులు, పొరపాట్లే ప్రత్యర్థులకు అస్త్రాలుగా మారతాయి. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని నెటిజన్లకు కూడా వీటిపై వారి ఇష్టం వచ్చినట్లు స్పందిస్తున్నారు.
సోమవారం తిరుపతిలో జరిగిన ధర్మ పోరాట సభలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

స్వాతంత్య పోరాటం చేసిన టీడీపీ..
నమ్మక ద్రోహం, కుట్రలపై సుదీర్ఘ ప్రసంగం చేసిన చంద్రబాబు.. బ్రిటీష్ వాళ్లపైన పోరాడిన జాతి తెలుగుదేశం పార్టీ అని వ్యాఖ్యానించారు. అసలు తెలుగుదేశం ఆవిర్భవించిందే 1982లో అయితే బ్రిటీస్ ప్రభుత్వంపై టీడీపీ ఎలా పోరాడుతుందని నెటిజన్లు సెటైర్లు సంధిస్తున్నారు.

అవమానమంటూ.. మరో నెటిజన్
బ్రిటీష్ వాళ్లపైనే పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీని.. అయ్యో ఈ విషయం ఏ పుస్తకాల్లోనూ రాయకపోవడం తెలుగుజాతికే అవమానం. దీని కోసం మనమంతా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ ఓ నెటిజన్ వ్యంగ్యంగా స్పందించాడు.

అంతా చంద్రబాబే..
‘భగత్ సింగ్ తోని బాంబు ఏపిచ్చిందే నేను...
ఆజాద్ తోని కాల్పులు జరిపించిందే నేను...
నేతాజీతోని ఆర్మీ పెట్టిచ్చిందే నేను...
అల్లూరికి విలువిద్య నేర్పిందే నేను...
శివాజీకి కత్తిసాము నేర్పిందే నేను...
రఘుతో ఈ పోస్ట్ పెట్టించిందే నేను...
మీరు ఈ పోస్టుకు లైకులు కొట్టాలని చెప్పిందే నేను'.. అంటూ రఘు అనే మరో నెటిజన్ చంద్రబాబు వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు.

బాబు, లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి..
మరికొందరు నెటిజన్లు మహాత్మా గాంధీ ఫొటో వెనకాల చంద్రబాబు కూర్చున్నట్లు, సుభాష్ చంద్రబోస్ పక్కన లోకేష్ నడుస్తున్నట్లు ఫొటోలు మార్ఫింగ్ చేసి.. చంద్రబాబు వ్యాఖ్యలపై సెటైర్లు వేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా, ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగేలా చేసే పోస్టులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పినా.. ఇలాంటివి జరుగుతుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications