చంద్రబాబు మరోసారి తప్పులో కాలేశారు: నెటిజన్లు వేసుకున్నారు!
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసే ప్రసంగాల్లో అప్పుప్పుడు తప్పులు దొర్లడం సహజమే. కొన్నిసార్లు ఆయన చెసే వ్యాఖ్యలు విమర్శలకు కూడా తావిస్తున్నాయి. తాజాగా, అలాంటి వ్యాఖ్యలు చేయడంతోపాటు సోషల్ మీడియాలో ట్వీట్ చేసి విమర్శలు ఎదుర్కొంటున్నారు.
బాబూ! ఇక నాకు దిక్కెవరు? ఐదు నిమిషాలే అడిగా!: అవమానమంటూ మోత్కుపల్లి ఆవేదన
గురువారం హైదరాబాద్లో నిర్వహించిన తెలంగాణ టీడీపీ మహానాడుకు సంబంధించి చంద్రబాబు ఒక ట్వీట్ చేశారు.
టీడీపీ హయాంలోనేనంటూ..
‘ఒకప్పుడు తాగునీరు లేని పరిస్థితి నుంచి హైదరాబాద్ నేడు మహానగరంగా మారిందంటే దాని వెనుక టీడీపీ ప్రభుత్వ శ్రమ, కష్టం ఎంతో ఉంది. దేశంలోనే నంబర్ వన్గా పేరొందిన బేంగంపేట విమానాశ్రయమూ టీడీపీ హయాంలోనే నెలకొల్పాం. భావితరాల భవిష్యత్తు కోసం హైటెక్ సిటీని నిర్మించాం' అని చంద్రబాబు పేర్కొన్నారు.
నిజాం రాజూ.. బాబుగారి దోస్తేనంటూ..
ఈ ట్వీట్పై నెటిజన్లు ఊరుకుంటారా? తమదైన శైలిలో సెటైర్లు వేశారు. బేగంపేట ఎయిర్పోర్ట్ 1930లోనే నిజాం రాజు కట్టించారని, అప్పటికి మన సారు ఇంకా పుట్టనేలేదని కొందరు వ్యాఖ్యానిస్తే.. ‘అవునవును.. నిజాం రాజు మీ దోస్తే కదా..'' అంటూ సెటైర్లు వేశారు మరికొందరు.
వెంటనే తొలగింపు.. కానీ..
ఆ తర్వాత తప్పును గ్రహించిన చంద్రబాబు.. కొద్ది నిమిషాలకు ఆ ట్వీట్ను డిలిట్చేసి.. ‘బేగంపేట' ప్రస్తావన లేకుండా మరో ట్వీట్ చేశారు. కానీ, అప్పటికే ఆ ట్వీట్ స్క్రీన్ షాట్లు వైరల్ అయిపోవడం గమనార్హం.
బేగంపేట విమానాశ్రయం నిజాం హయాంలోనే..
ఇక బేగంపేట విమానాశ్రయం చరిత్రకు సంబంధించిన విషయాల్లోకి వెళితే..
1930లో తొలుత హైదరాబాద్ ఎయిరో క్లబ్ పేరుతో నిజాం రాజు బేగంపేట విమానాశ్రయాన్ని నిర్మించారు. అనంతరం దక్కన్ ఎయిర్వేస్ లిమిటెడ్ పేరుతో అంతర్జాతీయ విమానాశ్రయంగా వర్ధిల్లింది. 1937లో తొలి టెర్మినల్, 1972లో కొత్త టెర్మినల్ భవనాలను నిర్మించారు. 2008లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమయ్యేనాటికి బేగంపేట ఎయిర్పోర్ట్ దేశంలోనే అత్యంత రద్దీగల ఆరో విమానాశ్రయంగా కొనసాగింది. ప్రస్తుతం హైదరాబాద్ ఓల్డ్ ఎయిర్ పోర్ట్గా పిలుస్తోన్న బేగంపేట విమానాశ్రయంను ఏవియేషన్, మిలటరీ ట్రైనింగ్ కోసం, అప్పుడప్పుడూ వీవీఐపీల రాకపోకల కోసం వినియోగిస్తుండటం జరుగుతోంది.