బస్సులపైన పసుపు రంగు తొలిగింపు - ఆ రంగు ఉంటే నచ్చదు : పల్లెల్లోకి కొత్త రంగులతో..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పసుపు రంగు అక్కడ కూడా కనిపించటానికి వీళ్లేదని స్పష్టం చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ గతంలో తీసుకున్న పలు నిర్ణయాలను మార్చేసింది. మొత్తం పసుపు రంగు నిర్మాణాల్లో నిర్వహించిన అన్నా క్యాంటీన్లను మూసేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేసి..తరువాత న్యాయస్థానం జోక్యంతో వాటిని తొలిగించింది. ఇక, ఇప్పుడు రంగుల విషయంలోనే మరోసారి ఆదేశాలు జారీ చేసింది. ఎంతో కాలంగా ఉమ్మడి రాష్ట్రం నుంచి దాదాపుగా ఆర్టీసీ బస్సులన్నీ ఒకే రంగులో కంటిన్యూ అవుతున్నాయి.
ఏనాడు ఎవరూ వాటి రంగులు మార్చాలని ఆలోచన చేయలేదు. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే బస్సులకు పల్లె వెలుగు అనే పేరుతో సర్వీసులను ప్రారంభించారు. ఇప్పటికీ రెండు రాష్ట్రాల్లో నూ అవే పేర్లతో కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్లోని జగన్ సర్కార్ పల్లె వెలుగు బస్సుల రంగును మార్చాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రధాన కార్యాలయం అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. జిల్లాల్లోని అన్ని పల్లెవెలుగు బస్సులు రంగులు మార్చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఇప్పటివరకు పల్లెవెలుగు బస్సులు ఆకుపచ్చ, పసుపు, తెలుపు, నలుపు రంగులతో ఉండగా, ఇప్పుడు వీటిలో పసుపు రంగును తొలగించనున్నారు. మిగతా మూడు రంగులతో పాటు కొత్తగా గచ్చకాయ రంగు వినియోగిస్తూ అధికారులు కొంత డిజైన్ మార్పు చేస్తున్నారు. మొదటగా రాజమహేంద్రవరంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్సుల రంగు మార్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దశల వారీగా ఏపీ మొత్తంగా దీనిని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ నిర్ణయం సైతం రాజకీయంగా వివాదానికి కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఈ నిర్ణయం వెనుక కారణమేంటనేది మాత్రం ఆర్టీసీ అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.