రిషికేశ్వరి రెండో డైరీలో షాకింగ్: 'సిబిఐతో దర్యాఫ్తు చేయించాలి'
గుంటూరు: రిషికేశ్వరి రెండో డైరీలో షాకింగ్ అంశాలు వెలుగులోకి రాగా... ఆమె తండ్రి మురళీ కృష్ణ, ఈ కేసులో సిబిఐ దర్యాఫ్తుకు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల రెండో డైరీ దొరకగా అందులో ఎన్నో అంశాలు వెలుగు చూశాయి.
దీనిపై రిషికేశ్వరి తండ్రి మురళీ కృష్ణ మాట్లాడుతూ... తన కూతురు కేసును సిబిఐతో విచారణ జరిపించాలని కోరారు. ప్రిన్సిపల్ బాబురావు పైన చర్యలు తీసుకోవాలన్నారు.
గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నెల రోజుల క్రితం రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ర్యాగింగ్ కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు సంబంధించి ఆమెకు సంబంధించిన రెండు డైరీలు పోలీసుల వద్ద ఉన్నాయి.
సీనియర్ అయిన శ్రీనివాస్తో మాట్లాడాలని అనీష తన పైన ఒత్తిడి చేసిందని, చరణ్ అసభ్యంగా ప్రవర్తించారని రిషికేశ్వరి రెండో డైరీలో ఉన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాను మంచి స్నేహితులుగా భావించి ఇద్దరు తనకు ప్రపోజ్ చేయడం బాధించిందని కూడా పేర్కొంది.
తనను వేధిస్తున్న విషయాలు ఎవరితో పంచుకోవాలో తెలియలేదని, తాను వారందర్నీ హేట్ చేస్తున్నానని డైరీలో పేర్కొంది. ఆర్కిటెక్ట్స్ కాలేజీ విద్యార్థులంతా స్టుపిడ్స్ అని, వరస్ట్ లైఫ్ అని, తాను ఓ బొమ్మలా మారానని పేర్కొన్న విషయం తెలిసిందే.