ఏపీలో ఊపందుకున్న కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ .. సబ్ కమిటీల ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది .ఏపీలో అధికారం రాగానే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. జిల్లాల పునర్విభజన కోసం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కమిటీకి ప్రత్యేక సంఘాలను, జిల్లా కమిటీలను ఏర్పాటు చేశారు.
ఆవ భూముల రగడ .. 500కోట్ల స్కాం అన్న టీడీపీ ..ఆవగింజంత అవినీతి కూడా లేదన్న మంత్రి
జిల్లాల పునర్విభజన కోసం కమిటీల ఏర్పాటు
ఏపీలో తాను అధికారంలోకి వస్తే, ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు . ఇక ఎన్నికల్లో అధికారం హస్తగతం చేసుకున్న జగన్ ఆ దిశగా ఆది నుండే అడుగులు వేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా మార్చేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి.జిల్లాల పునర్విభజన కోసం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కమిటీకి ప్రత్యేక సంఘాలను, జిల్లా కమిటీలను ఏర్పాటు చేశారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు నాలుగు సబ్ కమిటీలు .. ఉత్తర్వులు జారీ
రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన కోసం ఏర్పాటు చేసిన రాష్ట్రకమిటీకి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు సబ్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లుగా పేర్కొంది. జిల్లా బౌండరీలు, నియంత్రణ, లీగల్ వ్యవహారాల అధ్యయనానికి ఒక సబ్ కమిటీ, నిర్మాణాత్మకత, సిబ్బంది, పునర్విభజన అధ్యయనానికి రెండవ సబ్ కమిటీ, మౌలిక సదుపాయాల అధ్యయనం, ఆస్తుల అధ్యయనానికి మూడవ సబ్ కమిటీ, ఐటీ సంబంధిత పనుల అధ్యయనానికి నాలుగవ సబ్ కమిటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
సబ్ కమిటీలతో పాటు జిల్లా స్థాయి కమిటీలు
రాష్ట్ర స్థాయి కమిటీ, సబ్ కమిటీలకు సహాయం కోసం జిల్లా స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ జిల్లా స్థాయి కమిటీలకు చైర్మన్ గా కలెక్టర్ వ్యవహరిస్తారు.ఆయనతో పాటు పది మంది సభ్యులతో జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు కానుంది. అంతేకాదు ఏపీ సిఎఫ్ఎస్ఎస్ సీఈవో అధ్యక్షతన రాష్ట్ర స్థాయి కమిటీకి ప్రత్యేక కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.వివిధ రాష్ట్రాల్లో జిల్లాల పునర్విభజన పై అధ్యయనం చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయిన నేపథ్యంలో జిల్లాలు ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడం కోసం ఏపీ సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే సబ్ కమిటీలను,జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసింది.
Recommended Video
కొత్త జిల్లాలు ఇవే .. కమిటీల కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు వేగవంతం
ప్రస్తుతం ఉన్న జిల్లాలతో పాటు ఏపీలో మరో 12 కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ఈ కమిటీలు కొనసాగిస్తాయి.కొత్తగా ఏర్పాటు కానున్న 12 జిల్లాలు చూస్తే అనకాపల్లి (విశాఖ జిల్లా), అరకు (విశాఖ జిల్లా), అమలాపురం (తూర్పు గోదావరి), రాజమండ్రి (తూర్పు గోదావరి), నరసాపురం (పశ్చిమగోదావరి), విజయవాడ (కృష్ణా జిల్లా), నర్సరావుపేట (గుంటూరు జిల్లా), బాపట్ల (గుంటూరు జిల్లా), తిరుపతి (చిత్తూరు జిల్లా), రాజంపేట (కడప జిల్లా),నంద్యాల (కర్నూలు జిల్లా), హిందూపురం (అనంతపురం జిల్లా) అని తెలుస్తుంది. అంతే కాదు అరకుతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను కలుపుతూ మరో గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో కూడా జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి పార్వతీపురం హెడ్ క్వార్టర్ గా ఉంటుందని సమాచారం.