భవనం, సదుపాయాలు కల్పిస్తే ఏపిలో హైకోర్టు: సదానంద
న్యూఢిల్లీ: ప్రత్యేక హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలో నిర్ణయించి, మౌలిక సదుపాయాలు కల్పిస్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు నెలకొల్పడానికి చర్యలు చేపడతామని కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానందగౌడ తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు వినోద్కుమార్, జితేందర్ రెడ్డి, తెలుగుదేశం ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అరకు ఎంపీ కొత్తపల్లి గీత అడిగిన ప్రశ్నకు గురువారం కేంద్రమంత్రి లోక్సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
విభజన చట్టం ప్రకారం ఏపీలో కొత్తగా హైకోర్టును ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. అప్పటివరకూ హైదరాబాద్లో ఉన్నది ఉమ్మడి హైకోర్టు అవుతుందన్నారు. ఏపీలో హైకోర్టు ఏర్పాటు కాగానే, ఇది తెలంగాణ హైకోర్టు అవుతుందని తెలిపారు.
ఏపీ హైకోర్టు ఏర్పాటుకు అవసరమైన భవనాలు, ఇతర సౌకర్యాలు సమకూరినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఉమ్మడి హైకోర్టు నిర్ణయం తీసుకున్నట్లయితే కేంద్రం వెంటనే తగిన నోటిఫికేషన్ను జారీ చేసి హైకోర్టు విభజన ప్రక్రియను ప్రారంభిస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం నుంచి, ఉమ్మడి హైకోర్టు నుంచి వివరాలు ఇంకా అందలేదని పరోక్షంగా ప్రస్తావించారు.