కొత్త సినిమాలకు జగన్ జోష్ - టికెట్ ధరల పెంపు..!! ఎక్కడ- ఎంతమేర..!!
తెలుగు సినీ ఇండస్ట్రీకి సీఎం జగన్ కొత్త నిర్ణయాలు జోష్ ఇస్తాయా. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన సినిమాల విడుదల డేట్స్ ను మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపు వారిలో టెన్షన్ కు కారణమైంది. అయితే, కరోనా తగ్గటం..ఇదే సమయంలో ఏపీలోనూ టికెట్ల ధరలను పెంచుతూ అటు ప్రేక్షకుల పైన భారం పడకుండా.. ఇటు మూవీ మేకర్స్ కు నష్టం లేకుండా పెంచేందుకు సీఎం జగన్ నిర్ణయించారని చిరంజీవి వెల్లడించారు. దీంతో..ఇప్పుడు కొత్త సినిమాలకు కొత్త టికెట్ ధరలు అమలు కానున్నాయి.
టికెట్ ధరలు పెంపు..
ఈ నెలాఖరులోగా పెంచిన టికెట్ ధరలు అమల్లోకి వస్తాయని చెబుతున్నారు. తాజాగా.. సీఎం జగన్ తో చిరంజీవి టీం సమావేశమైన సమయంలో టికెట్ ధరల పెంపు పైన నిర్ణయానికి వచ్చారు. ఇక, త్వరలో చిరంజీవి నటించిన ఆచార్య... ప్రభాస్ నటించిన రాధే శ్యామ్... రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్.. పవన్ కళ్యాణ్ మల్టీ స్టారర్ భీమ్లా నాయక్ విడుదలకు సిద్దంగా ఉన్నాయి.
గతంలో సినిమా టెకెట్లు ధరలు నిర్ణయించిన ఉత్తర్వుల్లో ప్రతీ కేటగిరీలో మూడు తరగతులుగా నిర్ణయించే వారు. ఎకానమీ.. డీలక్స్..ప్రీమియంగా విభజించి టిక్కెట్ల ధరలను ఖరారు చేసేవారు. అయితే, తాజాగా తీసుకున్న నిర్ణయంలో మాత్రం ఈ తరగతులను ఏమైనా మార్చే ఆలోచన ఉందా...లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
ఏరియాల వారీగా ధరలు
తాజాగా.. ప్రభుత్వం సినీ ప్రముఖుల ముందు ప్రతిపాదించిన ధరలను పరిశీలిస్తే... మున్సిపల్ కార్పోరేషన్ల పరిధిలో మల్టీప్లెక్సుల ధర రూ 150 గా.. అదే విధంగా ఏసీ థియేటర్లలో కనిష్టం నై 70 కాగా... గరిష్టం రూ 100 గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఏసీ లేని థియేటర్లలో కనిష్టం రూ 40 కాగా, గరిష్ట ధర రూ 60 గా నిర్ణయించారు. మున్సిపాల్టీల్లో మల్టీప్లెక్సుల ధర రూ 125గా నిర్ణయించారు.
ఏసీ థియేటర్లలో మినిమం టిక్కెట్ ధర రూ 60 గా... గరిష్ఠ ధర రూ 80 గా ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఏసీ లేని థియేటర్లలో కనిష్ఠ ధర రూ 30... గరిష్ఠ ధర రూ 50 గా డిసైడ్ చేసారు. అదే విధంగా నగర పంచాయితీల్లో మల్టీప్లెక్సుల్లో టికెట్ ధర రూ 100 గా నిర్ణయించారు. ఏసీ థియేటర్లలో మినిమం రేటు రూ 50 గా, మాగ్జిమమ్ ధర రూ 70 గా ఫిక్స్ చేసారు. ఏసీ లేని థియేటర్లలో కనిష్టం రూ 20 కాగా, గరిష్టం రూ 40 గా ఖరారు చేసినట్లు సమాచారం.
కొత్త సినిమాలకు కొత్త రేట్స్
ఇక..రిక్లయినర్ సీట్ల ధర రూ 250 గా ఫిక్స్ చేసారు. టికెట్ ధరల పెంపు ప్రతిపాదనల పైన చిరంజీవితో సహా.. హీరోలు.. దర్శకులు సైతం సంతోషం వ్యక్తం చేసారు. ఇది రెండు వైపుల మేలు చేసే నిర్ణయంగా చిరంజీవి అభివర్ణించారు. అదే సమయంలో మహేష్ బాబు సైతం ట్వీట్ చేసారు. ఇక, తెలంగాణలో టికెట్ రేట్లు పెరిగినా.. ఏపీలో తగ్గించటం కారణంగా నష్టం అంటూ ఆవేదన వ్యక్తం చేసిన టాలీవుడ్ ప్రముఖలకు..ఇప్పుడు సీఎం జగన్ నిర్ణయం తో జోష్ పెరిగే అవకాశం ఉంది.
అయిదో షో .. బెనిఫిట్ షోల పైనా..
ఇక, ఏపీలోనూ ఈ నెల నుంచి సమ్మర్ వరకూ వరుసగా విడుదల కానున్న సినిమాలకు కలెక్షన్లు బాగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు. అయిదో షో..అదే విధంగా బెనిఫిట్ షో ల విషయంలోనూ సీఎం సానుకూలంగా స్పందించటం పైన సమావేశానికి హాజరైన టాప్ హీరోలు హర్షం వ్యక్తం చేసారు.
ఇక, అన్ని సినిమాలకు ఇవే రేట్లు వర్తిస్తామని.. ఒక్కో సినిమాకు ఒక్కో రేటు.. ఒక్కో హీరోకు ఒక్కో రేటు ఉండదంటూ సీఎం జగన్ సమావేశంలో తేల్చి చెప్పారు. చిన్న సినిమాలకు చేయూత నిచ్చే విధంగా.. ఆ సినిమా లకు థియేటర్లు దొరికే విధంగా చొరవ తీసుకోవాలంటూ ఆ బాధ్యతలను చిరంజీవి.. రాజమౌళికి సీఎం జగన్ అప్పగించారు.