వైసీపీలో కొత్త ట్రెండ్: మొన్న స్వామీజీవేషంలో కన్నబాబు రాజు, తాజాగా ఆర్టీసీబస్సులో మంత్రి పెద్దిరెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొత్త ట్రెండ్ మొదలైంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజాక్షేత్రంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సామాన్యుల్లో సామాన్యుల్లా కలిసిపోయే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. మొన్నటికి మొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన ఎలా ఉందని ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు నియోజకవర్గంలో స్వామీజీ గా మారు వేషంలో వెళ్ళి ప్రజలతో మాట్లాడి తెలుసుకోగా, ప్రజా సమస్యలను చర్చించగా, ఇక తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి అందరినీ షాక్ కు గురి చేశారు. సామాన్యుల్లో సామాన్యుడిగా కలిసిపోయిన ఆయన, ఆర్టీసీ బస్సులో టిక్కెట్ కొనుగోలు చేసి మరి సామాన్య ప్రజలతో కలిసి ప్రయాణించారు.
వేషం మార్చి స్వామీజీగా.. ఎలమంచిలిలో సంక్షేమ పథకాలపై ఆరా; ఎవరో తెలిసి అవాక్కైన ప్రజలు
ఆర్టీసీ బస్సులో టికెట్ కొనుక్కొని ప్రయాణం చేసిన పెద్దిరెడ్డి
ఏపీ పంచాయతీ రాజ్ , గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. సాధారణ ప్రయాణికుడిలాగానే కండక్టర్ వద్ద టిక్కెట్ కొనుగోలు చేసి మరీ ఆయన బస్సుల్లో ప్రయాణించడం ఇప్పుడు ఆసక్తికర చర్చకు కారణమవుతుంది. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని ఎస్ అగ్రహారం, ఏ కొత్తకోట మధ్య నూతన బస్సు సర్వీసులను ప్రారంభించిన ఆయన, విద్యార్థుల రాకపోకలకు అనువుగా నూతన బస్సులను ఏర్పాటు చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. పూజా కార్యక్రమాలతో కొత్త బస్సులను ప్రారంభించిన పెద్దిరెడ్డి ఆ తరువాత అందరితో కలిసి బస్సులో ప్రయాణం చేశారు.
జగన్ పేదల అభివృద్ధికి పెద్ద పీట వేశారన్న పెద్దిరెడ్డి
ప్రజల అవసరాల మేరకు పుంగనూరు నుండి మండల కేంద్రాల మీదుగా చిత్తూరు, అక్కడి నుండి చెన్నైకి వెళ్లే బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. జగన్ పేద ప్రజల అభివృద్ధికి పెద్దపీట వేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం చౌడేపల్లి మండలంలో పల్లెబాట కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘానికి 1.50 కోట్ల చెక్కులను అందించారు.
రైతు సంక్షేమం కోసం జగన్ సర్కార్ కృషి చేస్తుంది
ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తుందని, వైసిపి ప్రభుత్వ పాలనలో అన్నదాతలకు అధిక ప్రాధాన్యత లభిస్తోందని వెల్లడించారు. అంతేకాదు ప్రపంచ బ్యాంకు సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన మండలాల్లోని రైతు సంఘాలకు నిధులు మంజూరు చేస్తోందని పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాల వల్ల ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అధిక ఉత్పత్తులను సాధిస్తున్నామని, రైతుల కోసం మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామని, వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీని కూడా అందిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు.
ప్రజల్లో మమేకం అవ్వటమే కాదు జగన్ దృష్టిలోనూ పడే యత్నాల్లో నేతలు
ఇప్పటికే వైసీపీ మంత్రులు, నేతలు జగన్ సర్కార్ కు, ప్రభుత్వ పని తీరుకు ప్రజలు కితాబు ఇస్తున్నారని చెప్తున్నారు. అందుకే ఎన్నికలు ఏం జరిగినా సరే ప్రజల ఆదరణ వైసీపీ వైపే ఉందని అంటున్నారు. ఇక ఇలాంటి అభిప్రాయంతో ఉన్న వైసీపీ మంత్రులు, నేతలు ఇప్పటి నుండే ప్రజా క్షేత్రంలో ప్రజల్లో మమేకం అవ్వటానికి ప్రయత్నాలు సాగిస్తూ అటు ప్రజల్లోనే కాక సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టిలో కూడా పడాలని ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.