జగన్ కు కొత్త సమస్య- గడప గడపా ? సచివాలయాలా ? మంత్రులకూ చుక్కలు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జనంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. వైసీపీ ప్రభుత్వం వేస్తున్న ఎత్తుల్ని గమనిస్తే త్వరలో ముందస్తు ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. జనంలోకి వెళ్లడం ద్వారా ముందస్తుకు సిద్ధమయ్యేందుకు వైసీపీ సర్కార్ ఎంచుకున్న గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో ఇప్పుడు ఆ పార్టీకి కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి.
వైసీపీ గడప గడపకూ ప్రభుత్వం
ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూడేళ్లలో అమలు చేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా మరోసారి ఓటు అడిగేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం గడప గడపకూ ప్రభుత్వం పేరుతో కొత్త కార్యక్రమం చేపట్టింది. గతంలో నవరత్నాల్ని ఇలాగే ఇంటింటికీ తీసుకెళ్లి విజయవంతమైన వైసీపీ.. ఇఫ్పుడు గడప గడప పేరుతో ఇంటింటికీ నేతల్ని పంపుతోంది. అయితే ఇందులో వారికి పలు చోట్ల నిరసనలు తప్పడం లేదు. మూడేళ్ల పాలనపై అసంతృప్తి ఉన్న వారంతా ఇందులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు.
సంక్షేమంపై నిలదీస్తున్న ప్రజలు
గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్తున్న వైసీపీ నేతలు, మంత్రులకు ప్రజల నుంచి పలు చోట్ల నిరసనలు ఎదురవుతున్నాయి. ఇందులో ఎక్కువగా సంక్షేమ పథకాల్లో లోపాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.దీంతో జనం అడిగే ప్రశ్నలకు వైసీపీ మంత్రులు, నేతల వద్ద సమాధానం ఉండటం లేదు. అప్పటికి ఏదో సర్దిచెప్పి అక్కడి నుంచి వారు బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. చాలా మంది నేతలు, మంత్రులైతే గడప గడపకూ వెళ్లేందుకే జంకుతున్నారు. అయితే సీఎం జగన్ మాత్రం వెళ్లాల్సిందేనని వారికి తేల్చి చెప్పేస్తున్నారు.
సచివాలయాలపై ఒత్తిడి
గడప గడపకూ ప్రభుత్వంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల్ని ప్రజలు సంక్షేమ పథకాలపై నిలదీస్తున్న సందర్భంగా సచివాలయాల పనితీరు చర్చకు వస్తోంది. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది పథకాల విషయంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయాలు ప్రజల కోసం పూర్తిస్ధాయిలో పనిచేయడం లేదనే వాస్తవం వైసీపీ నేతలకు క్రమంగా అర్ధమవుతోంది.
జగన్ నిర్ణయంపై ఆసక్తి?
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో జనం సచివాలయాల విషయంలో తమను నిలదీస్తున్న పరిస్ధితిని వైసీపీ నేతలు సీఎం జగన్ కు చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. సచివాలయాల సిబ్బంది ఈ మూడేళ్లలో తమను పట్టించుకోలేదని, చాలా చోట్ల సంక్షేమ పథకాలు రాకపోయినా మిన్నకుండిపోతున్నారని, అడిగినా స్పందించడం లేదని వైసీపీ నేతలకు గడప గడపలో అందుతున్న ఫిర్యాదులు త్వరలో సీఎం జగన్ కు చేరబోతున్నాయి.
దీంతో సీఎం జగన్ ఇప్పుడు వీటిపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఓవైపు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇప్పటివరకూ ప్రొబేషన్ ఇవ్వలేదు.వచ్చే నెలలో వీరికి ప్రొబే్షన్ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో ప్రొబేషన్ ఇచ్చే సందర్భంగా సచివాలయాల ఉద్యోగులకు జగన్ ఎలా దిశానిర్దేశం చేస్తారన్న దానిపైనా ఇప్పుడు చర్చ జరుగుతోంది.