అంతా 'బొబ్బిలి' ప్లాన్: ఆత్మరక్షణ నుంచి ప్రతిదాడి వైపు జగన్, ఎవరీ శంబంగి?
విజయనగరం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆత్మరక్షణను వదిలిపెట్టి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన ఎదురు దాడికి సిద్ధమయ్యారు. గత కొద్ది రోజులుగా ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కుతున్నారు.
ఇప్పటి వరకు పదకొండు మంది వైసిపి ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరారు. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు ఈ నెల 18వ తేదీన సైకిల్ ఎక్కేందుకు నిర్ణయించుకున్నారు. పార్టీ మారే ఎమ్మెల్యేల విషయంలో జగన్ తొలుత ఆశించిన మేర స్పందించినట్లుగా కనిపించలేదని అంటున్నారు.
అయితే, టిడిపి ఆపరేషన్ ఆకర్ష్ ఫేజ్ 2 ప్రయోగించడంతో.. మరికొందరు ఎమ్మెల్యేలు చంద్రబాబు బుట్టలో పడుతున్నారు. దీంతో జగన్ ఇప్పుడు టిడిపి ఆపరేషన్ ఆకర్ష్ పైన సీరియస్గా దృష్టి సారించారు. పార్టీ మారే ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు. ఫోన్లు చేస్తున్నారు.
సుజయ వద్దకు పార్టీ సీనియర్లు విజయ సాయి రెడ్డి, ధర్మాన ప్రసాద రావు, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తదితరులను పంపించారు. అయితే సుజయ మాత్రం వారితో మాట్లాడేందుకు సిద్ధంగా లేనట్లు కనిపించింది. ఈ నేపథ్యంలో జగన్ ఆత్మరక్షణ నుంచి ప్రతి వ్యూహానికి లేదా ప్రతి దాడికి సిద్ధమయ్యారు.
బొబ్బిలిలో సుజయతో పాటు పెద్ద ఎత్తున ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు టిడిపిలో చేరనున్నారు. ఈ చేరికతో బొబ్బిలి నియోజకవర్గంలో వైసిపి ఖాళీ అయ్యే పరిస్థితులు తలెత్తుతున్నాయి. నియోజకవర్గంలో పార్టీని కాపాడుకునేందుకు జగన్ రంగంలోకి దిగారు. బొత్స సత్యనారాయణ పావులు కదుపుతున్నారు.
మాజీ విప్ శంబంగిని పార్టీలోకి ఆహ్వానించారు. దీని ద్వారా బొబ్బిలిలో సుజయకు చెక్ చెప్పాలని వైసిపి భావిస్తోంది. అలాగే మిగతా నియోజకవర్గాల్లోను ధీటైన నాయకులను తెరపైకి తీసుకు వచ్చేందుకు జగన్ ప్రతి వ్యూహం సిద్ధం చేస్తున్నారు. పార్టీ వీడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో బలమైన, ఇతర పార్టీలకు చెందిన అసంతృప్త నేతలను పార్టీలోకి ఆహ్వానించేందుకు పావులు కదుపుతున్నారని తెలుస్తోంది.
ఎవరీ శంబంగి?
సుజయకు చెక్ చెప్పేందుకు రంగంలోకి దిగిన బొత్స... శంబంగిని వైసీపీలోకి ఆహ్వానించారు. శంబంగి గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎమ్మెల్యేగా, విప్గా పని చేశారు. ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2013లో వైసిపికి రాజీనామా చేశారు.
అంతకుముందు, టిడిపిలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని భావించి వైసిపిలో చేరారు. ఆ తర్వాత ఆ పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఇతను 1983లో ఎన్టీఆర్ హయాంలోనే బొబ్బిలి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత టిడిపిలో చేరారు. 1985లో టిడిపి తరఫున బొబ్బిలి నుంచే గెలుపొందారు. 1994లోను టిడిపి తరఫున మరోసారి గెలిచారు.
1999లో టిడిపి తరఫున పోటీ చేసిన శంబంగి.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగన్ మోహన్ రావు చేతిలో ఓడిపోయారు. 2004లో సుజయ కృష్ణ రంగారావు చేతిలో మరోసారి ఓడిపోయారు. ఇప్పుడు ఆయనను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన దరికి మరోసారి చేర్చుకుంటుంది.