కొత్త సంవత్సరం వేడుకలు: అఖిలప్రియకు దిమ్మ తిరిగే షాక్
కర్నూలు: నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి భూమా అఖిలప్రియకు గట్టి ఎదురు దెబ్బనే తగిలింది. ఆమె వెంట ఉన్న అనుచరులు, కార్యకర్తలు ఏవీ సుబ్బారెడ్డి వైపు తిరిగారు.
బంధువులు కూడా ఆమె మాట వినలేదని అంటున్నారు. ఇది ఆమెకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. స్థానికంగా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అది చోటు చేసుకుంది.
ఏవీ సుబ్బారెడ్డి పిలుపు ఇలా..
నూతన సంవత్సరానికి స్వాగతం చెబుతూ ఆదివారం ఆళ్లగడ్డలో విందు కార్యక్రమం ఏర్పాటు చేశామని చెబుతూ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీగా హాజరు కావాలని ఏవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు.
అఖిలప్రియ ఇలా చేశారు..
ఏవీ సుబ్బారెడ్డి ఏర్పాట చేసిన విందుకు ఎవరూ వెళ్లవద్దని మంత్రి అఖిలప్రియ తన ప్రధాన అనుచరుడితో కార్యకర్తలకు, బంధువులకు ఫోన్లు చేయించారని సమాచారం. అయితే ఆమె మాటలను పెడచెవిన పెడుతూ ఆదివారం రాత్రి ఆళ్లగడ్డలోని ఏవీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విందుకు 10వేల మంది వరకు హాజరయ్యారు. దీంతో అఖిలప్రియకు దిమ్మతిరిగి పోయిందని అంటున్నారు.
అఖిలప్రియ బంధువులు కూడా..
అఖిలప్రియ బంధువులైన ఎస్వీనాగిరెడ్డి, ఎస్వీ ప్రసాదరెడ్డి కూడా ఏవీ సుబ్బారెడ్డి ఏర్పాటు చేసిన కార్యక్రమానకి హాజరయ్యారు. ఏవీ సుబ్బారెడ్డి ఫంక్షన్ను అడ్డుకోవాలని మంత్రి అఖిల ప్రియన చేసిన ప్రయత్నాలు ఏమీ ఫలించలేదని అంటున్నారు. మంత్రి వరాలు ప్రకటించినా ఎవరూ వినలేదని అంటున్నారు.
విందుకు వెళ్లవద్దని చెప్పినా..
విందుకు వెళ్లవద్దని అఖిలప్రియ నుంచి సమాచారం అందినప్పటికీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, గ్రామాల్లోని టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. భూమా నాగిరెడ్డిని నమ్ముకున్నవారందరికీ అండగా ఉంటానని, దానికోసం ఆళ్లగడ్డలోనే ఉంటానని ఏవీ సుబ్బారెడ్డి చెప్పారు.