ఏపీలో కరోనా కేసుల విస్ఫోటం: 10 వేల మార్క్ దాటి: రికార్డు స్థాయిలో 36 వేల వైరస్ పరీక్షలు
అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ పాజిటివ్ కేసుల విస్ఫోటం రాష్ట్రంలో కొనసాగుతోంది. లాక్డౌన్ సడలింపులను అమల్లోకి తీసుకొచ్చిన తరువాత రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా కేసులు భయానకంగా కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. కొద్దిరోజులుగా రాష్ట్రంలో వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడమే దీనికి నిదర్శనం. కరోనా కేసుల ఉధృతి ఏ మాత్రం తగ్గట్లేదు. 24 గంటల వ్యవధిలో కొత్తగా 497 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 10 వేల మార్క్ను దాటేసింది.
24 గంటల్లో 497
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం 497 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 448 కేసులు వేర్వేరు జిల్లాల్లో నమోదు కాగా.. 49 కేసులు విదేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి స్వస్థలానికి చేరుకున్న వారి ద్వారా నమోదైనట్లు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తమ తాజా బులెటిన్లో వెల్లడించారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 10331చేరుకుంది. ఇందులో ఇప్పటిదాకా 4779 మంది డిశ్చార్జి అయ్యారు. 129 మంది మృత్యువాత పడ్డారు. యాక్టివ్గా ఉన్న కేసుల సంఖ్య 5423గా నమోదైంది.
అనంతపురంలో అత్యధికంగా..
24 గంటల వ్యవధిలో అత్యధికంగా అనంతపురం జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ జిల్లాలో 90 కేసులు వెలుగు చూశాయి. చిత్తూరు-40, తూర్పు గోదావరి-54, గుంటూరు-39, కడప-24, కృష్ణా-36, కర్నూలు-76, నెల్లూరు-9, ప్రకాశం-8, విశాఖపట్నం-41, విజయనగరం-3, పశ్చిమ గోదావరి-28 కేసులు నమోదు అయ్యాయి. శ్రీకాకుళంలో కొత్తగా ఏ కేసూ వెలుగు చూడలేదు. ప్రస్తుతం ఈ ఒక్క జిల్లాలోనే అత్యల్పంగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 60 కేసులు శ్రీకాకుళం జిల్లాలో నమోదు కాగా.. 22 మంది డిశ్చార్జి అయ్యారు. ఇద్దరు మరణించారు. 36 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మూడు జిల్లాల్లో వెయ్యికి పైగా..
కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ఇప్పటిదాకా మొత్తం వెయ్యికి పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కర్నూలు-1483, కృష్ణా-1132, అనంతపురం-1028 కేసులు నమోదు అయ్యాయి. చిత్తూరు-657, తూర్పు గోదావరి-760, గుంటూరు-891, కడప-478, నెల్లూరు-493, ప్రకాశం-200, విశాఖపట్నం-367, విజయనగరం-63, పశ్చిమ గోదావరి-663 పాజిటివ్ కేసులు ఇప్పటిదాకా నమోదు కాగా.. ఆయా జిల్లాలన్నింట్లోనూ భారీ సంఖ్యలో డిశ్చార్జిలు నమోదు అవుతున్నాయి. మరణాల సంఖ్య కర్నూలు, కృష్ణా జిల్లాల్లోనే అత్యధికంగా ఉన్నాయి.
36 వేలకు పైగా పరీక్షలు..
రాష్ట్రంలో కరోనా వైరస్ పరీక్షలు గరిష్ఠస్థాయిలో నమోదు అయ్యాయి. 24 గంటల్లో 36,047 శాంపిళ్లను పరీక్షించారు. ఒక్కరోజులో ఇన్ని వేల సంఖ్యలో కరోనా పరీక్షలను నిర్వహించిన రాష్ట్రం మరొకటి లేదని వైద్యాధికారులు తెలిపారు. గరిష్ఠ స్థాయిలో వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నామని, ఫలితంగా కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయని స్పష్టం చేశారు. కరోనా వైరస్ పరీక్షల్లో రాష్ట్రం ఇప్పటికే దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందినప్పటి నుంచీ ఇప్పటిదాకా ఆరు లక్షలమందికి పైగా శాంపిళ్లను సేకరించి, పరీక్షించినట్లు వెల్లడించారు.