పయ్యావుల దారెటు..డిసైడ్ అయిపోయారా: టీడీపీ ఫైర్ బ్రాండ్ సైలెన్స్ : ముహూర్తం అదేనంటూ..!!
ఏపీలో టీడీపీ ఫైర్ బ్రాండ్స్ ఓక్కొక్కరుగా సైలెన్స్ అవుతున్నారు. 2019లో అధికారం కోల్పోయిన తరువాత సీనియర్లు కేడర్ లో ధైర్యం నింపాల్సింది పోయి..మిన్నకుండిపోతున్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు లేవు. ఇటువంటి సమయంలో పార్టీ సీనియర్ నేత..ఫైర్ బ్రాండ్ పయ్యావుల కేశవ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది.
అసెంబ్లీలో ఉన్నా...ప్రజల్లో నిలిచినా పయ్యావులది ప్రత్యేక స్టైల్. సభలో మైక్ లేకుండానే పార్టీ వాయిస్ బలంగా వినిపించే నేతల్లో పయ్యావుల ఒకరు. ఉరవకొండ నుండి ఎవరు గెలిచినా ఆ పార్టీ అధికారంలోకి రాదనే సెంటిమెంట్ 2019 ఎన్నికల్లో మరోసారి నిజమైంది. తొలి నుండి టీడీపీలో ఉన్న పయ్యావుల టీడీపీలో ..అనంత జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. కేశవ్ తండ్రి సైతం మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
ఫైర్ బ్రాండ్ మౌనం వెనుక..
కేశవ్ 1994, 2004, 2009 లో ఉరవకొండ నుండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. శాసనసభలో నాడు ఉమ్మడి రాష్ట్రంలో ధూళిపాళ్ల నరేంద్ర...పయ్యావుల కేశవ్..నాగం జనార్ధన రెడ్డి..అచ్చెన్నాయుడు..యనమల వంటి వారు టీడీపీ మౌత్ పీస్ లుగా వ్యవహరించే వారు. అయితే, 2014 లో అధికారంలోకి వచ్చిన సమయంలో కేశవ్ ఎమ్మెల్యేగా ఓడిపోయారు.
అక్కడ వైసీపీ నుండి విశ్వేశ్వర రెడ్డి గెలుపొందారు. ఆ తరువాత పయ్యావులకు మండలి సభ్యుడుగా నియమించారు. పార్టీ కోసం అప్పటి వరకు పని చేసిన కేశవ్ కు మంత్రి పదవి మాత్రం ఇవ్వలేదు. ఇతర పార్టీ నుండి గెలిచిన వారికి మంత్రి పదవులు ఇచ్చి..పార్టీ కోసమే పని చేసిన నరేంద్ర..కేవశ్ వంటి వారికి పదవులు ఇవ్వకపోవటం పైన సొంత పార్టీలోనే ఆగ్రహం వ్యక్తం అయింది.
చంద్రబాబుకు తెలిసొచ్చేలా..
అయితే, 2019 లో టీడీపీ 23 సీట్లు గెలవగా..అనంపురంలో రెండు సీట్లు గెలిచింది. అందులో ఒకటి హిందూపూర్ నుండి బాలయ్య... ఉరవకొండ నుండి పయ్యావుల కేశవ్. అయితే, గెలిచిన సమయం నుండి పయ్యావుల మౌనంగానే ఉంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పదువలు అనుభవంచిన వారు చాలా మంది ఉన్నారని..కష్టాల్లో ఉన్న సమయంలోనే తాము గుర్తుకు వస్తామా అంటూ పయ్యావుల అనుచరులు ప్రశ్నిస్తున్నారు.
దీంతో..కేశవ్ మనసులోని అభిప్రాయం గుర్తించిన చంద్రబాబు...ఆయనకు పీఏసీ ఛైర్మన్ గా అవకాశం ఇచ్చారు. అయినా..కేవశ్ మాత్రం సమావేశాలు నిర్వహించటానికి ముందుకు రాలేదు. శాసనసభలోనూ టీడీపీ పైన వైసీపీ ఎటాకింగ్ సమయంలో సహజంగానే ఎదురుదాడితో తిప్పికొట్టే కేశవ్ కేవలం సభలో హాజరు కోసమే వచ్చినట్లుగా వ్యవహరించారనే చర్చ ఉంది.
తనపై ఆరోపణలు వచ్చినా...
ఇక, అమరావతి భూముల విషయంలోనై తన పైన వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇస్తూనే...విచారణ చేయించుకోవాలని తన సహజ ధోరణికి భిన్నంగా మెత్తగా సమాధానం ఇచ్చారు. అయితే, ఇప్పటికే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా రెండేళ్లు దాటి పోయింది. అయినా...ఎక్కడా వైసీపీ పాలన పైన వ్యతిరేకంగా స్పందించిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి జగన్ పైనా ఎటువంటి విమర్శలు..అరోపణలు లేవు.
తన మిత్రుడు నరేంద్ర అరెస్ట్ అయినా..స్పందించలేదు. నరేంద్ర విడుదల తరువాత వెళ్లి పరామర్శించారు కానీ, ఎక్కడా ప్రభుత్వం పైన వ్యాఖ్యలు చేయలేదు. వైసీపీ నుండి కేశవ్ పైన ఎటువంటి ఆరోపణలు..విచారణలు... అభియోగాలు లేవు. శాసనసభలోనూ కేశవ్ గురించి వైసీపీ బెంచ్ ల నుండి విమర్శలు లేవు. ఇదే సమయంలో ఉరవకొండలో విశ్వేశ్వర రెడ్డి తన పని తాను చేసుకుపోతు న్నారు.
వైసీపీ హైకమాండ్ సూచనలు..
కేశవ్ కు వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. వైసీపీ ముఖ్య నేతల నుండి వచ్చిన సూచనల మేరకే జిల్లా వైసీపీ నేతలు సైతం కేశవ్ పైన వ్యతిరేకంగా మాట్లాడటం లేదని జిల్లాలో టాక్. స్థానిక సంస్థల ఎన్నిక ల సమయంలోనూ కేశవ్ నామ్ కే వాస్తే పని చేసారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు అనధికారింగా వైసీపీకి దగ్గరయ్యారు. ఇక, ఇప్పుడు కేశవ్ సైతం అదే బాటలో నడుస్తారనే చర్చ టీడీపీలోనే జరుగుతోంది. అయితే, కేశవ్ లాంటి వారిని వదులుకోవటానికి చంద్రబాబు సిద్దంగా లేరని పార్టీలో సీనియర్లు ఆఫ్ ది రికార్డు చెబుతున్న మాట.
మంచి ముహూర్తంలో సీఎంను కలుస్తారంటూ..
అయితే, కేశవ్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని.. గుర్తింపు లేని పార్టీలో కొనసాగాల్సిన అవసరం లేదనే భావన వ్యక్తం అవుతోందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దీంతో..కేశవ్ త్వరలో వైసీపీ లో చేరుతారంటూ ప్రచారం సాగుతోంది. మూడు రాజధానుల విషయంలో పార్టీ మొత్తం వ్యతిరేకించినా..కేశవ్ మాత్రం స్పందించలేదు. ఇక, త్వరలోనే కేశవ్ సీఎం ను కలుస్తారనేది తాజా సమాచారం. ఇందుకు శ్రావణ మాసం ముహూర్తంగా చెబుతున్నారు. కేశవ్ టీడీపీని వీడాలని నిర్ణయిస్తే..ఖచ్చితంగా అది టీడీపీకి జిల్లాలో భారీ నష్టమే.