రెబల్ సీటు నుండి బాబాయ్ పోటీ..!!? మనోభీష్టం నెరవేరాలంటే..పోటీగా సాయిరెడ్డి : సీఎం జగన్ నయా స్ట్రాటజీ..!!
ముఖ్యమంత్రి జగన్ బాబాయ్..ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమర్దతకు పరీక్ష పెట్టనున్నారా. సీఎం జగన్ కోర్ టీంలో కీలక సభ్యుడైన సుబ్బారెడ్డి కి కీలకమైన ఆ ఆపరేషన్ బాధ్యతలు అప్పగించనున్నట్లు వైసీపీలో ప్రచారం సాగుతోంది. ఆయన మరోసారి లోక్ సభ ఎన్నికల బరిలో నిలబడే అవకాశం కనిపిస్తోంది. ఎక్కడ...ఎలా అంటే..వైసీపీలో జరుగుతున్న చర్యలు..అనూహ్య నిర్ణయాలు ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతున్నాయి.
ఈ నెల 21వ తేదీతో టీటీడీ ఛైర్మన్ గా సుబ్బారెడ్డి నియమితులై రెండేళ్లు పూర్తవుతుంది. నియామక జీవోలో కాల పరిమితి ప్రస్తావించలేదు. కానీ, రెండేళ్ల కంటే ఎక్కువ కాలం కంటిన్యూ అవ్వాలంటే మరో సారి ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, అసలు సుబ్బారెడ్డి రెండేళ్ల కాలం చాలని..ఇక తాను టీటీడీ ఛైర్మన్ గా కొనసాగలేనని చెబుతున్నారు. మరొకరికి అవకాశం ఇవ్వాలని ఆయనే సూచిస్తున్నారు.
పెద్దల సభ వైపు సుబ్బారెడ్డి చూపు..
వైసీపీ ఏర్పాటు నుండి అధికారంలోకి వచ్చే వరకు జగన్ కుటుంబంతో నిలిచిన సుబ్బారెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నేరుగా అధికార చక్రం తిప్పే అవకాశం మాత్రం దక్కలేదు. 2014 లో ఒంగోలు నుండి ఎంపీగా గెలిచి..పూర్తి కాలం ఎంపీగా కొనసాగకుండా..ప్రత్యేక హోదా కోసం ముందుగానే రాజీనామా చేసారు. ఇక, 2019 ఎన్నికల్లో లోక్ సభ సీటు దక్కలేదు. ఆయన స్థానంలో టీడీపీ నుండి వచ్చిన మాగంటి శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. దీంతో..వైసీపీ అధికారం లోకి వచ్చిన తరువాత బాబాయ్ కు టీటీడీ ఛైర్మన్ కేటాయించారు సీఎం జగన్. అయితే, ఇప్పుడు రెండేళ్లు టీటీడీ ఛైర్మన్ గా అనేక వివాదాలకు..విమర్శలకు సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. దీంతో.. మిగిలిన మూడేళ్లు రాజకీయంగా చక్రం తిప్పాలని కోరుకుంటున్నారు. ఇందు కోసం పెద్దల సభలో అవకాశం కోరుకుంటున్నారు. అయితే, వచ్చే జూన్ వరకు రాజ్యసభలో వైసీపీకి స్థానం దక్కే పరిస్థితి లేదు. దీంతో.. ఇప్పుడు సుబ్బారెడ్డికే తిరిగి మరో ఏడాది టీటీడీ ఛైర్మన్ గా కంటిన్యూ చేసే అవకాశం ఉందనే ప్రచారమూ పార్టీలో జరుగుతోంది.
సుబ్బారెడ్డికి అడ్డుగా సాయిరెడ్డి..
కానీ, సుబ్బారెడ్డి మాత్రం తిరిగి పార్లమెంట్ కే ప్రాతినిధ్యం వహించాలని బలంగా కోరుకుంటున్నారు. పార్టీ పరంగా గోదావరి జిల్లాల ఇన్ ఛార్జ్ గా సుబ్బారెడ్డి ఉన్నారు. ఇక, పెద్దల సభకు ప్రచారం సాగుతున్నట్లుగా ముఖ్యమంత్రి ఇప్పటికే ఎవరికి ఇవ్వాలనేది ఫిక్స్ అయిపోతే.. మరో రెండు ప్రతిపాదనల పైనా చర్చ సాగుతోంది. ఏ ఎంపిక..నియామకమైన పక్కాగా సామాజిక సమీకరణాలు అమలు చేసే జగన్ సొంత బాబాయ్ అయినా..వెంటనే పెద్దల సభకు అంగీకరించే పరిస్థితి కనిపించటం లేదు. వచ్చే జూన్ లో వైసీపీకి దక్కనున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో విజయ సాయిరెడ్డికి రెన్యువల్ ఖాయం. దీంతో..రెడ్డి వర్గానికి మరో స్థానం ఇవ్వటం సాధ్యపడదనే అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో.. ఎమ్మెల్సీ అయి జగన్ త్వరలో విస్తరించే కేబినెట్ లో స్థానం దక్కించుకోవటం పైన ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. కానీ, అందుకూ సమీకరణాలు అడ్డుపడే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లా నుండి రెడ్డి వర్గం నుండి బాలినేని.. ఎస్సీ వర్గం నుండి సురేష్ ప్రస్తుతం కేబినెట్ లో ఉన్నారు. దీంతో..ఆ జిల్లా నుండి సుబ్బారెడ్డికి అవకాశం దక్కే పరిస్థితి లేదు. ఇతర జిల్లాల్లో పెద్ద ఎత్తున సీనియర్లు క్యాబినెట్ బెర్తు కోసం పోటీ పడుతున్నారు.
రెబల్ సీటు నుండి ఉప ఎన్నికల్లో...
దీంతో..చివరి ఆప్షన్ గా వైసీపీ నేతలు ఆశిస్తున్నట్లుగా నర్సాపురం ఎంపీగా రఘురామ రాజు పైన అనర్హత వేటు పడితే ఆ స్థానంలో ఉప ఎన్నిక జరగాల్సి ఉంటుంది. దీంతో..అక్కడ నుండి సుబ్బారెడ్డిని పోటీకి దింపే అవకాశం ఉందనే వాదన పార్టీలో వినిపిస్తోంది. అయితే, ఇప్పటికే రఘురామ రాజు స్థానంలో అదే సామాజిక వర్గానికి ఇవ్వాలని భావిస్తే ఇప్పటికే వైసీపీలో చేరిన గోకరాజు రంగరాజు కుటుంబానికి ఆ సీటు వైసీపీ కేటాయించే అవకాశం ఉందనేది మరో చర్చ. అయితే, క్షత్రియ వర్గానికి టీటీడీ ఛైర్మన్ కేటాయించి..నర్సాపురం నుండి సుబ్బారెడ్డిని పోటీలో దించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఎందుకంటే త్వరలో జరగనున్న ఆరు రాష్ట్రాల ఎన్నికలతో పాటుగానే ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. అంటే..దాదాపుగా 2022 ప్రధమార్ధంలో ఎన్నిక జరిగినా..గెలిచినా..2024 వరకు మాత్రమే ఎంపీగా ఉంటారు. దీంతో..ఇతరులు ఆ ఉప ఎన్నికలో పోటీకి ముందుకొచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీంతో.. అక్కడి ఆశావాహులకు 2024 లో సీటు పైన హామీ ఇచ్చి సుబ్బారెడ్డిని బరిలోకి దింపుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
పార్టీలో చర్చ..జగన్ దే ఫైనల్ డెసిషన్..
ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాల్లో 2019 ఎన్నికల ముందు నుండి సుబ్బారెడ్డి పార్టీ పరంగా పట్టు సాధించారు. అయితే, అంత సులువుగా అంతు చిక్కని జగన్ వ్యూహాలు..చివరి నిమిషం వరకు బయటకు రావు. రఘురామ రాజు ప్రాతినిద్యం వహించిన స్థానంలో ఉప ఎన్నిక వస్తే అది వైసీపీకి మరింత ప్రతిష్ఠాత్మకంగా మారనుంది .దీంతో..సుబ్బారెడ్డిని అక్కడి నుండి పోటీ చేయించే అవకాశాల పైన పార్టీలో అప్పుడే చర్చ సాగుతోంది. వీటన్నింటకి..రానున్న రోజుల్లో చోటు చేసుకొనే రాజకీయ పరిణామాలు సమాధానం ఇవ్వనున్నాయి. అయితే, ఇదంతా ముందస్తు చర్చగా కనిపించినా... వైసీపీ నేతలు మాత్రం అన్ని లెక్కలు పక్కా అని చెబుతున్నారు. దీంతో...సామాజిక సమీకరణాలే కీలకంగా అడుగులు వేసే సీఎం జగన్ ఫైనల్ గా సుబ్బారెడ్డి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.