కీలక పరిణామాల వేళ ఢిల్లీకి చంద్రబాబు..!!
ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుంటోంది. ఇక పాలన.. ప్రభుత్వ పరంగా మార్పులకు కూటమి ముఖ్య నేతలు సమాయత్తం అవుతున్నారు. ఇటు ప్రధాని హైదరాబాద్ పర్యటనలో ప్రత్యేకంగా చంద్రబాబు.. పవన్ నివాసాలకు వెళ్లారు. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు. తాజా పరిణామాల పైన చర్చించనున్నారు. అదే విధంగా ఇతర మంత్రులతోనూ చంద్రబాబు సమావేశం అవుతున్న వేళ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. ప్రభుత్వ వ్యవహారాలతో పాటుగా రాజకీయ కీలక అంశాల పైన కేంద్రంలోని ముఖ్యులతో చర్చించనున్నారు. త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ దిశ గా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రేపు ఉదయం 11:30 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో సమావేశమై పోలవరం ప్రాజెక్టు పనులు, నిధుల విడుదలపై చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, విభజన హామీల అమలుపై కేంద్ర పెద్దలతో సీఎం సంప్రదింపులు జరపనున్నారు. అదే విధంగా మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచ బ్యాంకు ప్రతి నిధులు ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి అవసరమైన రుణ సాయం, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

ఢిల్లీ పర్యటనలో కీలక నిర్ణయాలు
కాగా, సాయంత్రం 4 గంటలకు హోటల్ తాజ్ ప్యాలెస్లో జరిగే భారత పరిశ్రమల సమాఖ్య (CII) బిజినెస్ సమ్మిట్కు ముఖ్యమంత్రి హాజరవుతారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పారిశ్రామికవేత్తలతో ఆయన మాట్లాడనున్నారు. అనంతరం ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్. మహేంద్రదేవ్ సహా నీతి ఆయోగ్ సభ్యులతో సమావేశమై రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి ప్రణాళికలపై చర్చించనున్నారు. రేపు రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న చంద్రబాబు.. మరుసటి రోజు కూడా మరికొంతమంది కేంద్ర మంత్రులు, ప్రముఖులతో భేటీ అయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే.. ఈ పర్యటనలో రాజకీయ అంశాల పైన జరిగే చర్చల్లో కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.













Click it and Unblock the Notifications