మాజీఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం విషమం.. హుటాహుటిన ఓరుగల్లుకు కేటీఆర్, హరీష్ రావ్
బి ఆర్ ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈరోజు ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హఠాత్తుగా ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హన్మకొండ లోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి కి వైద్యులు వైద్యం చేస్తున్నారు. అయితే ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి సీరియస్
ఆసుపత్రికి తీసుకు వెళ్లిన వెంటనే సిపిఆర్ నిర్వహించిన వైద్యులు ఆయనను అత్యవసర విభాగం నుంచి కార్డియో ఎమర్జెన్సీకి తరలించారు. ఇప్పటికే రెండుసార్లు సిపిఆర్ నిర్వహించిన వైద్య బృందం ప్రస్తుతం అత్యవసర చికిత్సను అందిస్తూ నిరంతరాయంగా పర్యవేక్షిస్తోంది. అయితే ఆయనకు హార్ట్ బీట్ తిరిగి వచ్చిందని పేర్కొన్నారు. నిమోనియా కారణంగా ఆయన శరీరం సహకరించటం లేదని సమాచారం.

హుటాహుటిన బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు
పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు అన్న వార్త విన్న వెంటనే బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు హుటాహుటిన హన్మకొండకు బయలుదేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అస్వస్థతకు గురైన విషయంతో ఉమ్మడి జిల్లాలోని కార్యకర్తలు అభిమానులు బి ఆర్ ఎస్ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు రోహిణి ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితి పైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వైద్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం పైన హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది ఆరోగ్యంపై వదంతులు వ్యాప్తి చేయొద్దని డాక్టర్ సుధాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
పెద్ది రాజకీయ ప్రస్తానం
ఇదిలా ఉంటే 52 సంవత్సరాల వయసున్న పెద్ది సుదర్శన్ రెడ్డి 2019లో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున నర్సంపేట శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు పౌరసరఫరాల సంస్థ చైర్మన్ గా ఎన్నికయ్యారు. 2001లో కెసిఆర్ ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన పెద్ది సుదర్శన్ రెడ్డి నల్లబెల్లి మండల జడ్పిటిసి గా గెలుపొంది జడ్పీ ఫ్లోర్ లీడర్ గా కొనసాగారు.
అంచలంచలుగా ఎదిగిన నాయకుడు
ఆ తర్వాత అంచలంచలుగా ఎదిగిన ఆయన వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా టిఆర్ఎస్ పార్టీకి సేవలందించారు . ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆయన కీలక భూమిక పోషించారు తర్వాత 2006 నుండి 2014 వరకు పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యునిగా పనిచేశారు. కెసిఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా, ఉద్యమ నేతగా అనతికాలంలోనే రాష్ట్ర స్థాయిలో రాజకీయ గుర్తింపును సాధించారు.
పెద్ది ఆరోగ్యం పై కార్యకర్తలు, పార్టీ నాయకుల ఆందోళన
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి పైన పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుత ప్రభుత్వ విధానం పైన పోరాటంలోనూ ఆయన ముందు వరుసలో నిలిచారు. మొదట నుండి పోరాట పంధా ఎంచుకున్న ఉద్యమ నాయకుడు కావటంతో అయన ఆరోగ్యంపై కార్యకర్తలు, పార్టీ నాయకులు ఆందోళనలో ఉన్నారు.












Click it and Unblock the Notifications