Newsmakers 2019: గెలుపు-ఓటములు లేవు! ప్రశ్నిస్తూనే పవన్ కళ్యాణ్
అమరావతి: పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ప్రముఖ సినీనటుడిగా ఆయన మంచి గుర్తింపునే తెచ్చుకున్నారు. తన సోదరుడు, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి బాటలోనే ఆయన కూడా రజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని తలచారు. ఈ నేపథ్యంలోనే 2014లో జనసేన పార్టీని స్థాపించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో..
తెలంగాణ ఉద్యమం ఉధృతం సాగుతున్న సమయంలోనే.. 2014, మార్చి 14న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ప్రారంభించారు. కుల, మత, ప్రాంతీయ పక్షపాతాల లేకుండా భారతీయునిగా జాతి సమైక్యతను సమగ్రతకు పాటుపడేందుకు పార్టీ స్థాపించినట్లు పవన్ కళ్యాణ్ ఆనాడే ప్రకటించారు. రాష్ట్రాన్ని విభజించిన తీరుకు కాంగ్రెస్పై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలంటూ పిలుపునిచ్చారు. ఆ పార్టీ నుంచి ప్రజలను కాపాడాలని వ్యాఖ్యానించారు.
టీడీపీ-బీజేపీ గెలుపులో కీలకంగా..
కాగా, 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పవన్ కళ్యాణ్.. తన మద్దతును బీజేపీ, టీడీపీలకు ప్రకటించారు. కొత్తగా ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి అవసరమని.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నిలిచారు. ప్రధాని నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడుతోపాటు పలు రాజకీయ ప్రచార వేదికలను ఆయన పంచుకున్నారు. 2014లో కొత్తగా ఏర్పడిన ఏపీలో టీడీపీ, బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు పవన్ కళ్యాణ్ కీలక భూమికనే పోషించారు.
2019లో పూర్తిగా మారిన పరిస్థితి..
అయితే, 2019 ఎన్నికలు వచ్చేసరికి పరిస్థితి మొత్తం మారిపోయింది. తాను ఒంటరిగానే పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ తలచారు. రాజకీయ విభేదాల కారణంగా టీడీపీ, బీజేపీలు కూడా తెగతెంపులు చేసుకున్నాయి. ఏపీలో అవినీతి బాగా పెరిగిపోయిందంటూ అధికార టీడీపీపై పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. వామపక్షాలతో పొత్తు పెట్టుకుని ఆయన ఎన్నికల్లో పోటీకి దిగారు. ఎన్నికల ప్రచారంలో అటు టీడీపీ, ఇటు వైసీపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీపైనా విమర్శలు చేశారు.
పవన్ కళ్యాణ్ జనసేనకు షాకిచ్చిన ఎన్నికల ఫలితాలు
అంత బాగానే ఉన్నప్పటికీ 2019 ఎన్నికల ఫలితాలు మాత్రం పవన్ కళ్యాణ్, జనసేన పార్టీకి షాకిచ్చాయి. అధికారంలోకి వస్తుందని, లేదంటే అధికారం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని అనుకున్న జనసేన పార్టీ.. కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలుపొంది.. ఘోర ఓటమిని చవిచూసింది.
రెండు చోట్ల పోటీ చేస్తే..
అంతేగాక, 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. ఆ రెండు చోట్లా ఓటమిపాలు కావడం మరింత చేదు అనుభవంగా చెప్పుకోవచ్చు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం తరపున రెండు స్థానాల్లో పోటీ చేసి ఒక స్థానం గెలుపొందగా.. పవన్ కళ్యాణ్ మాత్రం రెండు స్థానాల్లోనూ ఓడిపోవడం రాజకీయంగా అప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూనే..
అయితే, తాను తెలుగు ప్రజలు, రైతుల బాధలను చూడలేకే రాజకీయాల్లోకి వచ్చానంటూ పవన్ కళ్యాణ్ మొదట్నుంచి చెప్పుకొచ్చారు. తాను ముఖ్యమంత్రి పదవి కోసం రాజకీయాల్లోకి రాలేదని.. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలను ప్రశ్నించేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానంటూ పవన్ కళ్యాణ్ పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాను సినిమా రంగంలో ఉంటే ఏ లోటు ఉండదని.. అయినా ప్రజలు, రైతులు, సమాజం బాగు కోసమే తాను రాజకీయాలను ఎంచుకున్నట్లు తెలిపారు. అప్పుడు ఇప్పుడు తాను ప్రజా సమస్యలపై పోరాటాన్ని కొనసాగిస్తానని పవన్ కళ్యాణ్ ఇప్పటికీ స్పష్టం చేస్తూనే ఉన్నారు. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానంటూ.. తాను చేసిన ప్రకటనకు పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా రైతులు, ఫ్లోరిసిస్ బాధితులు, తదితర సమస్యలపై పోరాడిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక.. కూడా రైతులు, ప్రజలు, తెలుగు భాష, ఇసుక కొరత, రాజధాని సమస్యలపై ప్రశ్నిస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ పోరాటాల వల్ల ప్రజలకు ఎంతో కొంత మేలు జరుగుతోందనే వాదనలు మాత్రం వినబడుతున్నాయి.