జగన్ సర్కార్ కు ఎన్జీటీ బిగ్ షాక్..రాయలసీమ ఎత్తిపోతల పనులకు బ్రేక్!!
జాతీయ హరిత ట్రిబ్యునల్ రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో జగన్ సర్కార్ కు పెద్ద షాక్ ఇచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల పనులను చేపట్టవద్దని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేయవద్దని ఎన్జిటీ తేల్చిచెప్పింది. దీంతో రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణానికి బ్రేక్ పడినట్లయింది.
రాయలసీమ ఎత్తిపోతల పనులకు ఎన్జీటీ బ్రేక్
రాయలసీమ ఎత్తిపోతల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మధ్య నెలకొన్న వివాదంపై గత కొంత కాలంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో వాదనలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించతలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పై పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని భావించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. అనుమతులు తీసుకునే నిర్మాణం చెయ్యాలని, ప్రస్తుతం రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణాన్ని నిలిపి వేయాలని సూచించింది.
అధ్యయనానికి కమిటీ .. నాలుగు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం
అంతేకాదు ప్రాజెక్టు నిర్మాణంలో అధ్యయనానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. నాలుగు నెలల్లో నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వాలని సూచించింది. ఏపీ ప్రధాన కార్యదర్శి పై కోర్టు ధిక్కార చర్యలు అవసరం లేదని పేర్కొంది. అదే సమయంలో నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణం చేపడితే ఏపీ ప్రభుత్వం బాధ్యత వహించాలని తేల్చిచెప్పింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు తో జగన్ సర్కార్ కు భారీ దెబ్బ తగిలినట్లయింది. ఏపీ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణకు చెందిన గవినోళ్ళ శ్రీనివాస్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ పై చెన్నైలోని ఎన్జీటీ ధర్మాసనం విచారణ నిర్వహించింది.
రాయలసీమ ప్రాజెక్ట్ పై కేంద్ర పర్యావరణ శాఖను నివేదిక కోరిన ఎన్జీటీ
పిటిషనర్ తరపు వాదనలు, ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు విన్న తర్వాత తీర్పును ఈ రోజు వెలువరించింది .ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ కేసు విషయంలో తమ వైఖరి ఏంటో చెప్పాలని కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించగా కేంద్ర పర్యావరణ శాఖ తమ అఫిడవిట్ దాఖలు చేసింది.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పాత పథకమే అని , దానివల్ల అదనపు ఆయకట్టు సాగులోకి వచ్చే అవకాశం ఏ మాత్రం లేదని కేంద్రం స్పష్టం చేసింది . లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను సాగునీటిప్రాజెక్ట్ , విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్ లుగా పరిగణించలేమని పేర్కొంది. గత ప్రాజెక్ట్ లకు ఫీడర్ గా మాత్రమే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పని చేస్తుందని , అంతే తప్ప దానితో అదనపు ఆయకట్టు సాగుకు అవకాశం లేదని కేంద్రం స్పష్టం చేసింది.
ఏపీ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించలేదన్న కేంద్ర పర్యావరణ శాఖ
ఇక దీనికి సంబంధించిన పర్యావరణ అనుమతుల గురించి కూడా ప్రస్తావిస్తూ ఇది పాత ప్రాజెక్ట్ , అన్నీఅనుమతులు ఉన్నాయని స్పష్టం చేసింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లో ఎలాంటి నిబంధనల ఉల్లంఘనలు జరగలేదని పేర్కొంది. గతంలోనే ఏపీ ప్రభుత్వం ఎపీలోని తెలుగు గంగ , గాలేరు నగరి సుజల స్రవంతి , శ్రీశైలం కుడి కాల్వలకు గతంలోనే వేర్వేరు అనుమతులు తీసుకున్నారని అఫిడవిట్ లో పేర్కొంది . ఇక తెలుగురాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాల పరిష్కారానికి కృష్ణా నదీ ట్రిబ్యునల్ పని చేస్తుందని , నీటి మీటర్ల ఏర్పాటుకు ఆదేశించిందని , దానిని కేంద్రం పర్యవేక్షిస్తుంది అని కేంద్రం స్పష్టం చేసింది .
కృష్ణా బోర్డు బృందాన్ని పరిశీలనకు పంపిన ఎన్జీటీ ,నివేదికలో అనేక అంశాలు
ఇక ఇదే సమయంలో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కృష్ణానది యాజమాన్య బోర్డు బృందం ప్రాజెక్టు పనులను పరిశీలించి నివేదికను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు సమర్పించింది. ఈ నివేదికలో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు డిపిఆర్ తయారీలో అవసరమైన వాటికి మించి అక్కడ పనులు జరుగుతున్నాయని కృష్ణా బోర్డు బృందా అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రాజెక్టు పనులకు సంబంధించిన వివరాలను వివిధ ఛాయా చిత్రాలతో సహా నివేదికలో పొందుపరిచింది ప్రాజెక్టు పరిసర ప్రాంతాలలో పర్యటిస్తున్న సమయంలో అక్కడ ఎలాంటి పనులు జరగడం లేదని కానీ నిర్మాణ పనులకు కావలసిన సామాగ్రి అక్కడ నిల్వ చేశారని పేర్కొంది.
వాదోపవాదాలు, నివేదికల అధ్యయనం తర్వాత ఎన్జీటీ తీర్పు
కేంద్ర పర్యావరణ శాఖ సమర్పించిన అఫిడవిట్ ను, కృష్ణానది యాజమాన్య బోర్డు సమర్పించిన నివేదికను ఆధారంగా చేసుకొని విచారణ జరిపిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫైనల్ గా జగన్ సర్కార్ కు షాక్ ఇచ్చింది. వాదోపవాదాలు, నివేదికల అధ్యయనం తర్వాత ఎన్జీటీ తీర్పు ఇచ్చింది. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టరాదని ఆదేశాలు జారీ చేసింది.