పంచాయతీ వార్ : సీఎస్ కు నిమ్మగడ్డ మరో లెటర్: నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారే ఈ సారి టార్గెట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలపర్వం కొనసాగుతుంది . రాష్ట్ర ఎన్నికల సంఘానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య రోజు రోజుకూ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎస్ఈ సి మరియు ప్రభుత్వం ఒకరు తీసుకున్న నిర్ణయాలకు ఇంకొకరు వ్యతిరేకిస్తూ పంచాయతీ ఎన్నికలలో ఆసక్తికర చర్చకు కారణమవుతున్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో లేఖ
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వరుస లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా నిమ్మగడ్డ సీఎం ఆదిత్య నాథ్ దాస్ కు మరో లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని ఈ లేఖలో గుర్తు చేసిన ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలలో నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారికి సంబంధించిన కీలక అంశాలను, పాటించాల్సిన రూల్స్ ను లేఖ ద్వారా తెలియ చేశారు.
నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారికి సంబంధించి పలు ఆదేశాలు
వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు , డైరెక్టర్లు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ప్రయాణిస్తే అది ఎన్నికల ప్రచారంగానే భావిస్తామని సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు రాసిన లేఖలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల పర్యటన సమయంలో వారు ప్రభుత్వ వాహనాలు, ప్రభుత్వ సిబ్బందిని ఉపయోగించకూడదని కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. ప్రైవేట్ వాహనాలను వినియోగించినా వాటిపై తమ హోదాను సూచించే నేమ్ ప్లేట్లు ఉండకూడదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు.
ప్రభుత్వ వాహనాలు, సదుపాయాలు వినియోగించరాదు , ప్రైవేట్ వాహనాల్లోనూ నో నేమ్ ప్లేట్స్
ప్రభుత్వ వాహనాలు, సదుపాయాలు కూడా ఎన్నికల సమయంలో ఎన్నికలు జరుగుతున్న చోట వినియోగించకూడదు అని పేర్కొన్న రమేష్ కుమార్ చైర్మన్లు తమతో పాటు ప్రభుత్వ అధికారులను తీసుకు వెళ్లకూడదని లేఖ ద్వారా తెలియజేశారు. మొన్నటికి మొన్న ప్రభుత్వం జారీ చేస్తున్న కుల ధ్రువీకరణ పత్రాలు , నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ల మీద సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలను తొలగించాలని లేఖలో పేర్కొన్నారు. అభ్యర్థులకు జారీచేసే సర్టిఫికెట్ల విషయంలో ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన ధృవీకరణ పత్రాలు జారీ చెయ్యాలన్నారు .
Recommended Video
తనకు ఉన్న అధికారాన్ని అస్త్రాలుగా వాడుతున్న నిమ్మగడ్డ
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఒకరు తీసుకున్న నిర్ణయాలను ఇంకొకరు వ్యతిరేకిస్తూ, ఎన్నికల సమయంలో రాష్ట్రంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తమకు ఉన్న అధికారాన్ని అస్త్రాలుగా ఉపయోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగితే, దేశం మొత్తం ప్రత్యేకమైన ఆసక్తి రేకెత్తేలా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, వైసిపి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం గమనార్హం.