నిమ్మగడ్డ వ్యవహారంలో మరో మలుపు.. జగన్ సర్కారుపై ఎస్ఈసీ ధ్వజం.. కోర్టు ధిక్కారమంటూ ఫైర్..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునర్నియామకంపై కొనసాగుతోన్న వివాదంలో ఆదివారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ హైకోర్టు తీర్పుతో ఎస్ఈసీగా నిమ్మగడ్డ నియామకం, పదవి పునరుద్ధరణ ఉత్తర్వులు చెల్లబోవంటూ అడ్వకేట్ జనరల్ శ్రీరాం ప్రకటించడం, ఆ వెంటనే దానికి సంబంధించి జారీ చేసిన సర్క్యులర్ను ప్రభుత్వం ఉపసంహరించుకోవడంపై స్వయంగా రమేశ్ కుమారే స్పందించారు. ప్రభుత్వ చర్యలు.. కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లే కాకుండా, ఎన్నికల కమిషన్ సమగ్రతతను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన ధ్వజమెత్తారు.

తాజాగా మరో లేఖ..
హైకోర్టు తీర్పు, దానికి అనుగుణంగా తాను జారీచేసిన ఆదేశాలు, దానిపై ఏపీ సర్కారు స్పందన, తన పునర్నియామకానికి సంబంధించిన వ్యవహారం తదితర అంశాలను ప్రస్తావిస్తూ.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదివారం తాజాగా మరో లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో ప్రభుత్వం తీరుపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

అందుకే ఆ పని చేశా..
తన పదివీకాలాన్ని తగ్గిస్తూ జగన్ సర్కారు తీసుకొచ్చిన ఆర్డినెన్స్, ఆమేరకు విడుదల చేసిన జీవోలను ఏపీ హైకోర్టు కొట్టేసిందన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. ఎస్ఈసీగా జస్టిస్ కనగరాజ్ నియామకాన్ని కూడా కోర్టు రద్దు చేసిందని గుర్తుచేశారు. తీర్పు 308 నెంబర్ పేరాలో ఎస్ఈసీగా తననే కొనసాగించేలా పునరుద్ధరణకు కోర్టు ఆదేశాలిచ్చిందని, తద్వారా పదవీకాలం పూర్తయ్యే వరకు(2021 మార్చి 31 వరకు) తానే ఎస్ఈసీగా కొనసాగేందుకు మార్గం సుగమమైందని తెలిపారు. రాజ్యాంగ పదవి అయిన ఎస్ఈసీ ఖాళీగా ఉండకూడదన్న సూత్రం ప్రకారం, కోర్టు తీర్పును అనుసరించి.. బాధ్యతలు స్వీకరించినట్లుగా సమాచారం అందజేశానని, ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి కూడా సర్క్యులర్ ద్వారా నోటిఫై చేశారని.. కానీ ప్రభుత్వం మాత్రం నిబంధనలు, కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.

మళ్లీ హైకోర్టుకు..
తన పునర్నియామకానికి సంబందించి శుక్రవారం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై.. శనివారం అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ ప్రకటన, ఆ వెంటనే ఎస్ఈసీ కమిషనర్ ఉత్తర్వుల ఉపసంహరణతో ఏపీ ప్రభుత్వం.. హైకోర్టు ఆదేశాలను ఆదేశాలను ఉల్లంఘిస్తోన్నట్లు స్పష్టంగా అర్థమవుతున్నదని నిమ్మగడ్డ ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి, సమగ్రతను దెబ్బతీసేలా ప్రభుత్వ వ్యవహరిస్తున్నదని, దీనిపై తిరిగి హైకోర్టునే ఆశ్రయించనున్నట్లు, కోర్టు ధిక్కారం కింద పిటిషన్ వేయాలనే యోచనలో ఉన్నట్లు నిమ్మగడ్డ పేర్కొన్నారు.

సుప్రీంకోర్టుకు సర్కారు..
నిమ్మగడ్డ వ్యవహారంలో ఏపీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఏజీ శ్రీరామ్ వెల్లడించారు. కాగా, కోర్టుకు ప్రస్తుతం వేసవి సెలవులు ఉన్నందున వెకేషన్ బెంచ్ని ఆశ్రయించడమా? లేక సెలవుల అనంతరం పిటిషన్ వేయాడమా? అనే అంశంపై ఏపీ సర్కారు సమాలోచనలు చేస్తున్నది. దీనిపై ఒకటిరెండు రోజుల్లో స్పష్టత రానుంది. మరోవైపు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ వాణీ మోహన్ ను నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది.
Recommended Video

పొలిటికల్ ఫైట్..
నిమ్మగడ్డ వ్యవహారంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. హైకోర్టు తీర్పు ప్రకారం చూస్తే ఎస్ఈసీగా రమేశ్ కుమార్ పునర్నియామకం జరిగిపోయినట్లేనని, దీనిపై ఏజీ అనవసర వివాదాన్ని రేపుతున్నారని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ విమర్శించారు. కోర్టు తీర్పులపై జగన్ సర్కారు సంఘర్షణ వైఖరి రాజ్యాంగ సంక్షోభానికి దారితీసేలా ఉందని, వైసీపీ తీరు.. న్యాయం కోసం తపించినట్లుగా కాకుండా, న్యాయ వ్యవస్థలపై కక్షతో పోరాడినట్టుగా ఉందని టీడీపీకే చెందిన మరో నేత వర్ల రామయ్యఅన్నారు. నిమ్మగడ్డ విషయంలో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం కంటే, హైకోర్టు ఆదేశాలను అమలు చేయడమే మంచిదని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ హితవుపలికారు. ఈ విషయంలో ప్రభుత్వం సరిగానే వ్యవహరిస్తున్నదని, కోర్టులపై తమకు నమ్మకం, విశ్వాసం మెండుగా ఉన్నాయని, ప్రతిపక్ష పార్టీలే లేనిపోని రార్ధాంతం సృష్టిస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications