అవగాహన లేని మంత్రి.. అంబటి రాంబాబుపై నిమ్మల రామానాయుడు విసుర్లు
ఏపీలో కొత్త మంత్రులు బాధ్యతలు వరసగా చేపడుతున్నారు. తమ తమ పనులు కూడా చేస్తున్నారు. అయితే విమర్శలు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. నిన్న జలవనరుల శాఖ మంత్రి పదవీని అంబటి రాంబాబు చేపట్టిన సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడారు. పూర్తి చేస్తామని.. వైఎస్ఆర్ కల అని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై టీడీపీ నేత నిమ్మల రామానాయుడు ప్రస్తావించారు.
అవగాహన లేని మంత్రి..?
పోలవరం ప్రాజెక్ట్పై అంబటి రాంబాబుపై నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు. మంత్రి అంబటి రాంబాబు.. నీటి పారుదల శాఖ మంత్రో లేక అవగాహన లేని మంత్రో అర్ధం కావట్లేదని విరుచుకుపడ్డారు. మంత్రి అంబటి రాంబాబు పోలవరం డయాఫ్రమ్ వాల్ పై అవగాహన లేకుండా మాట్లాడారని నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన రోజే సీఎం జగన్.. పోలవరం ప్రాజెక్ట్ పై విషం చిమ్ముతూ పక్కన చేశారని ఆరోపించారు. ఇప్పుడు దానిని కొత్త మంత్రి కొనసాగిస్తున్నారని దుమ్మెత్తి పోశారు.
మరీ అప్పుడు ఎందుకు నిలిపేశారు..?
2020కి పూర్తవ్వాల్సిన ప్రాజెక్టును 2019 మే లోనే ఎందుకు అర్ధాంతరంగా నిలిపివేశారని రామానాయుడు ప్రశ్నించారు. కొత్త ఏజెన్సీ లేకుండా.. ఉన్న ఏజెన్సీని రద్దు చేయటం దేనికి సంకేతం? అని నిలదీశారు. స్పిల్ వే నుంచి 50 లక్షల క్యూసెక్కుల నీరు మళ్లించే సామర్థ్యం అందుబాటులో ఉండగా ఫ్లడ్ మేనేజ్మెంట్ గాలికొదిలేశారని విమర్శించారు. ఇవన్నీ చేస్తూ.. పైకి మాత్రం ప్రాజెక్టు పూర్తి చేస్తాం అని కామెంట్స్ మాత్రం చేస్తున్నారు.
భద్రతకు ఎవరు బాధ్యులు
కాంట్రాక్ట్ ఏజెన్సీని మార్చుకుంటూ పోతే ప్రాజెక్టు భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారని రామానాయుడు ప్రశ్నించారు. ఉన్న వాటితో పనులు పూర్తి చేయమని పీపీఏ సీఈవో పంపిన హెచ్చరికను ఖాతరు చేయలేదని చెప్పారు. 2020 వరదల్లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిని ఉంటే రెండేళ్లు ఎందుకు దాచి పెట్టారని ప్రశ్నించారు.
ఎందుకు కావాలని అలా వ్యవహరించారని నిలదీశారు. 2021 డిసెంబర్ వరకు ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఎందుకు అసెంబ్లీ సాక్షిగా అసత్యాలు చెప్పారని అడిగారు. ఇంకా ఎన్ని రోజులు ఇలా అబద్దాలు వల్లెవేస్తారని అడిగారు. అబద్దాలు చెప్పి చెప్పి.. ఎందుకు మోసం చేస్తారని ఆయన అడిగారు.