స్మార్ట్ సిటీ: టీకి 5, ఏపీకి 4, బెజవాడ రాజధానికాదని..
న్యూఢిల్లీ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా వంద స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసే వంద స్మార్ట్ సిటీలలో తెలుగు రాష్ట్రాలలో తొమ్మిది నగరాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం నుండి ఐదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి నాలుగు నగరాలు కేంద్రం స్మార్ట్ సిటీ జాబితాలో ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ నగరాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుండి విజయవాడ, గుంటూరు, చిత్తూరు, కర్నూలు నగరాలు ఉన్నాయి.
విజయవాడ రాజధాని కాదు: జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించినంత మాత్రాన విజయవాడ రాజధాని కాబోదని, దానికి ప్రత్యేక విధానం ఉంటుందని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి అన్నారు. ఏపీ రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని కోరుతూ ఆర్ఎస్ఎఫ్, ఆర్ఎస్యూ సంయుక్తంగా నిర్వహించిన కడప ఆకలి కేక మహాసభలో ఆయన మాట్లాడారు.
రాయలసీమలో నిరుపయోగంగా ఉన్న వేల ఎకరాల భూమిని కాదని, సంవత్సరానికి మూడు పంటలు పండుతున్న మాగాణి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయడం సరికాదన్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను కేంద్రం పరిశీలిస్తోందని, పచ్చని పంట పొలాలను నాశనం చేసే నిర్ణయం కేంద్రం తీసుకోబోదన్నారు.