కాంగ్రెస్ నేత హత్య కేసులో 9 మందికి జీవిత ఖైదు
నెల్లూరు: నెల్లూరు జిల్లా సంగం మండలం మర్రిపాడు గ్రామంలో జరిగిన కాంగ్రెస్ నేత హత్య కేసులో తొమ్మిది మంది సిపిఎం కార్యకర్తలకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ నెల్లూరు నాల్గో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి సిహెచ్ శ్రీరామచంద్రమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. ముద్దాయిలు మేకల వెంకటరమణయ్య, మేకల జనార్దన్, మేకల శ్రీనివాసులు, నేలపాటి కిష్టయ్య, గద్దె అశోక్, సమాది హజరత్, వల్లెపు తిరుపతి, పెరుమాళ్ల మల్లికార్జున, వనమా సుబ్రహ్మణ్యం ఒక్కొక్కరికి ఆరువేల ఐదు వందల రూపాయలు జరిమానా విధించారు.
కేసు వివరాలు ఇలా ఉన్నాయి - సంగం మండలం మర్రిపాడు గ్రామంలో వెంకటరమణయ్య సిపిఎంలో బలమైన నాయకుడు. అతడిపై నెల్లూరు ఐదో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక హత్య కేసులో కూడా నిందితుడు. మరో క్రిమినల్ కేసులో ప్రధాన నిందితుడు. 2006 జరిగిన ఎంపిటిసి ఎన్నికల్లో మేకల భాస్కరయ్య భార్య పద్మావతమ్మ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి రమణయ్యపై ఘన విజయం సాధించింది.

అలాగే మర్రిపాడు సర్పంచ్ అభ్యర్థిగా గోసు హజరత్తయ్యను కాంగ్రెస్ పార్టీ తరఫున హతుడు భాస్కరయ్య నిలబెట్టి గెలిపించాడు. ఆ ఎన్నికల్లోనూ సిపిఎం అభ్యర్థిగా నిలబడ్డ రమణయ్య పరాజయం పాలయ్యాడు. దీంతో కక్ష పెంచుకున్న వెంకటరమణయ్యతో పాటు గ్రామంలోని సిపిఎం కార్యకర్తలు భాస్కరయ్యను హత్య చేశారు.
2006 ఆగస్టు 23 రాత్రి 8 గంటల సమయంలో బడిబావి సెంటర్ వద్ద ఆటోలో వస్తున్న మేకల భాస్కరయ్యపై వెంకటరమణయ్య నాయకత్వంలో తొమ్మిది మంది మారణాయుధాలతో దాడిచేసి హత్య చేశారు. హతుడు భార్య పద్మావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంగం పోలీసులు నిందితులపై ఛార్జిషీటు దాఖలు చేశారు. కేసు విచారణ అనంతరం న్యాయమూర్తి 9 మందిని దోషులుగా ప్రకటించారు.












Click it and Unblock the Notifications