జగన్ని ప్రశ్నించా: పవన్కు బాబు, పెళ్లై పదేళ్లైనా ఏం చేయలేనోడు: వెంకయ్య
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కాంగ్రెస్ పార్టీకి సోమవారం నాడు చురకలు అంటించారు. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు సమీపంలోని నిమ్మలూరులో బెల్ నిర్మిస్తున్న అడ్వాన్సుడ్ నైట్ విజన్ ఉత్పత్తుల పరిశ్రమకు వారు శంకుస్థాపనం చేశారు. ఈ సందర్భంగా వారు కౌంటర్ ఇచ్చారు.
సాంకేతిక కారణాలతో ఇవ్వలేమంది
సాంకేతిక కారణాలతో ప్రత్యేక హోదా ఇవ్వలేమని, దానికి సమానమైన ఆర్థికలబ్ధి చేకూరుస్తామని కేంద్రం చెప్పినప్పుడు, విజ్ఞతతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ కంటే హోదాతో అదనంగా వచ్చేదేమిటని, అది నేను కూడా తెలియకపోతే తెలుసుకుంటానని అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని అడిగానని, కానీ వారు ఏమీ చెప్పలేకపోయారని అన్నారు.
పవన్ కళ్యాణ్కు కౌంటర్
కేంద్రమంత్రి వెంకయ్యను కొందరు ప్రశ్నిస్తున్నారని, ఆయనను తిడుతున్నారని, ఆయనను అంటే ఏం వస్తుందని పవన్ను ఉద్దేశించి పరోక్షంగా చంద్రబాబు అన్నారు. ప్రత్యేక ప్యాకేజీలో ప్రకటించిన అంశాలకు వీలైనంత త్వరగా చట్టబద్ధత కల్పించాలని చంద్రబాబు కోరారు. వెంకయ్య ఇందుకు చొరవ తీసుకోవాలన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో రాజీపడనన్నారు.
ప్రత్యేక హోదా అవసరమే కానీ
ప్రత్యేక హోదా అవసరం ఉందని, సాంకేతిక ఇబ్బందుల వల్ల ఇవ్వలేమని కేంద్రం చెప్పిందని, కేంద్రమంత్రులు వెంకయ్య, సుజనా చౌదరి రాజ్యసభలో చేసిన ఒత్తిడి వల్ల ప్యాకేజీ ఇవ్వడానికి అంగీకరించిందని చంద్రబాబు చెప్పారు. కేంద్రం ఇచ్చే నిధులు వద్దంటే ఎలా అభివృద్ధి సాధిస్తామన్నారు. వైసిపి లాలూచీ రాజకీయాలతో అసెంబ్లీలో దారుణంగా ప్రవర్తించిందన్నారు.
వైసిపి అడ్డుకుంటోంది
విపక్షం భోగాపురం ఎయిర్ పోర్టును అడ్డుకుంటున్నారు, రాజధానిని అడ్డుకున్నారు, పట్టిసీమను అడ్డుకుంటున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇలా అభివృద్ధి ఎక్కడ జరుగుతున్నా అడ్డుకుంటూ వైసిపి నాయకులు ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి వ్యవసాయంతోపాటు పరిశ్రమలు కూడా ముఖ్యమని చెప్పారు. మచిలీపట్నంలో ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీని రామ్మూర్తిపంతులు స్థాపించారని, దానిని 1983లో బెల్ టేకోవర్ చేసిందన్నారు.
వెంకయ్యను అంటే ఏం రాదు
కేంద్రమంత్రి వెంకయ్య రెండుసార్లు కర్ణాటక నుంచి, ఈసారి రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారని చంద్రబాబు అన్నారు. జన్మభూమి కాబట్టి రాష్ట్రానికి ఏదో చేయాలని తపన పడుతున్నారన్నారు. ఆయనను విమర్శిస్తే ఏం వస్తుందన్నారు.
కాపులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నా
తాను కాపులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నానని చెప్పారు. వెయ్యి కోట్లతో కార్పొరేషన్ పెట్టామన్నారు. కాపు విద్యార్థుల విదేశీ చదువు కోసం రూ. 10 లక్షల వరకు ఇస్తున్నామని... ఎవరూ అడక్కపోయినా కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పామని.. ఆ మాట నిలబెట్టుకుంటామని చెప్పారు.
పోలవరం పూర్తి చేస్తాం
ఎట్టి పరిస్థితుల్లో 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు అన్నారు. అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టుకు తక్షణం రూ. 50 కోట్లు విడుదల చేయాలని కలెక్టర్ అరుణ్ కుమార్ని సీఎం ఆదేశించారు. సర్ ఆర్థర్ కాటనను గుర్తుపెట్టుకున్నట్లే... చంద్రబాబునూ ప్రజలు గుర్తుంచుకుంటారని సుజనా చౌదరి పేర్కొన్నారు.
నేను ఏపీ ఎంపీని కాదు..
తాను ఏపీ ఎంపీని కాదని, ఇతర రాష్ట్రాల నుంచి నుంచి ఎంపీనయ్యానని, అయినా ఆంధ్రప్రదేశ్ బిడ్డగా, జన్మభూమి రుణం తీర్చుకోవడం కోసం రాష్ట్ర విభజన సమయంలో 28 అంశాల మీద అడిగానని, ప్రత్యేక హోదా కూడా నేనే అడిగానని, కానీ అప్పటి ఇక్కడి కాంగ్రెస్ ఎంపీలు నోరుమూసుకుని లోపల వాళ్ల అమ్మ సోనియా వద్ద తలలూపి, బయటకొచ్చి తలకాయలు వేలాడేసుకున్నారని, ఆ సమయంలోనే నేనే ఏపీ కోసం అడిగానని, సాధించానని వెంకయ్య అన్నారు. చంద్రబాబు సమర్థుడైన సీఎం అన్నారు.
పెళ్లై పదేళ్లయినా ఏం చేయలేనోడు
ప్రత్యేక హోదా పైన తనను కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుండటంపై వెంకయ్య మండిపడ్డారు. ఈ సందర్భంగా కథ చెప్పిన అలరించిన విషయం తెలిసిందే. ఆయన మాటల్లో.. 'ఒకాయన పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. తండ్రిని పెళ్లిచేయాలని అడిగాడు. ఆయన చూద్దాంలే అన్నాడు. తనకు పెళ్లి చేయడం లేదని ఆ కుర్రాడు ఊళ్లోవాళ్లతో చెప్పాడు. మీరైనా చెప్పి చేయించాలని అడిగాడు. వారంతా మీ అబ్బాయి తొందరపడుతున్నాడు.. పెళ్లి చేసేయండన్నారు. తండ్రి సరేనని పెళ్లిచేశాడు. ఏడాదైంది. ఏం కాలేదు. రెండేళ్లయింది.. ఏం కాలేదు. పదేళ్లయింది.. అయినా ఏం కాలేదు. ఏందిరా పెళ్లని ప్రాణాలు తీశావు. మీ నాన్నతో చెప్పమన్నావు. ఇంకా ఏం కాలేదని అడిగితే.. ఇంకో అవకాశం ఇచ్చి చూడండి.. ఈసారి చూపిస్తా తడాఖా అన్నాడట. హోదా పైన తనపై ఇప్పుడు విమర్శలు చేస్తున్న నేతల తీరు అలా ఉందని అభిప్రాయపడ్డారు. 50 ఏళ్ల నుంచి అధికారంలో ఉండి ఏమీ చేయలేని వాళ్లు ఇప్పుడు మీరు దిగిపోండి.. మేం వచ్చేస్తామని చెప్పడం విడ్డూరమన్నారు.