ఏపీ సర్కారు పనితీరు భేష్: సీఎం జగన్తో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ భేటీ, పర్యటన
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనపై నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ ప్రశంసలు కురిపించారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డా. రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల బృందం రాష్ట్రంలో పర్యటించింది. కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో ప్రకృతి వ్యవసాయాన్ని నీతి ఆయోగ్ బృందం పరిశీలించింది.

ఏపీ సర్కారు పనితీరు భేష్ అంటూ నీతి ఆయోగ్ రాజీవ్ కుమార్
బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో రాజీవ్ కుమార్ మట్లాడుతూ.. సీఎం జగన్ చేస్తున్న పాలనకు అభినందనలు తెలిపారు. ఏపీ ఏం జరుగుతుందో తెలుసుకున్నానని, సీఎం జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు రిమార్కబుల్ అని వ్యాఖ్యానించారు. డిజిటల్ లైబ్రరీ, రైతు భరోసా కేంద్రాలు, వికేంద్రీకరణ దేశంలో ఎక్కడా లేని వినూత్న ఆలోచనలని చెప్పారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక యాప్ తీసుకొచ్చారని, కోవిడ్ వలన అనాథలైన పిల్లలకు రూ.10 లక్షలు డిపాజిట్ చేశారని తెలిపారు. వీటిని ఇతర రాష్ట్రాలకు కూడా సూచిస్తామని చెప్పారు. ఇక్కడ పరిస్థితులను ప్రత్యక్షంగా చూశాక ఏపీ కచ్చితంగా అగ్రస్థానాన్ని చేరుకుంటుందని తెలిపారు. అంతటి సామర్థ్యం ఏపీ రాష్ట్రానికి ఉందని, నీతి ఆయోగ్ నుంచి సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని రాజీవ్ కుమార్ తెలిపారు.

ఏపీ సీఎంతో రాజీవ్ కుమార్ భేటీ.. అండగా ఉండాలన్న జగన్
బుధవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీలో అమలవుతోన్న నవరత్నాలు, రాష్ట్ర విభజన వల్ల ఎదురైన ఇబ్బందులను అధికారులు నీతి ఆయోగ్ బృందానికి వివరించారు. ప్రత్యేక హోదా, పారిశ్రామిక రాయితీ, పన్ను మినహాయింపు ఇవ్వాలని అధికారులు కోరారు. కోరాపుట్, బాలంగీర్, బుందేల్ ఖండ్ తరహాలో ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. విభజన హామీలను నెరవేర్చాలని కోరారు. రాష్ట్ర విద్యుత్ రంగ సమస్యలను నీతి ఆయోగ్ దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రానికి నీతి ఆయోగ్ అండగా నిలుస్తూ సహాయ సహకారాలు అందించాలని కోరారు. రుణభారంతో సతమతమవుతోన్న విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలను ఆదుకోవాలని.. వాటిని గాడిలో పెట్టేందుకు తగిన సాయం చేయాలని నీతి ఆయోగ్ బృందాన్ని కోరారు.
Recommended Video

ప్రకృతి వ్యసాయం బాగుందన్న రాజీవ్ కుమార్
కాగా, రెండు రోజుల పాటు ఏపీలో జరిగే వివిధ కార్యక్రమాలలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్, నీతి ఆయోగ్ బృందం పాల్గొననున్నారు. వీరపనేని గూడెంలో నీతి ఆయోగ్ బృందం పర్యటన ముగిసింది. అక్కడి నుంచి నీతి ఆయోగ్ బృందం విజయవాడకు బయల్దేరింది. వీరపనేనిగూడెం గ్రామ సచివాలయాన్ని నీతి ఆయోగ్ బృందం సందర్శించింది. గ్రామ సచివాలయం పనితీరును జిల్లా కలెక్టర్ జె.నివాస్ నీతి ఆయోగ్ బృందానికి వివరించారు. నీతి ఆయోగ్ బృందానికి సేంద్రీయ పద్ధతిలో పండించిన పంటలతో తయారు చేసిన ఆహారపదార్ధాలను వీరపనేని గూడెం గ్రామస్తులు అందజేశారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ డా. రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. వీరపనేని గూడెం గ్రామస్తులుప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడం నిజంగా అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ఇలాగే మరింత మంది ప్రకృతి వ్యవసాయం వైపు అగుడులేయాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications