స్వచ్ఛభారత్: ఐదేళ్లలో సాకారం, 10 రోజుల్లో ప్రధానికి నివేదిక: చంద్రబాబు
న్యూఢిల్లీ: ఐదేళ్లలో స్వచ్ఛ భారత్ను సాకారం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చంద్రబాబు అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛ భారత్పై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సూచనలిచ్చారన్నారు.
స్వచ్ఛభారత్పై 10 రోజుల్లో ప్రధాని నరేంద్రమోడీకి నివేదిక ఇస్తామన్నారు. సబ్ కమిటీ సమావేశంలో ముఖ్యంగా వ్యర్థ పదార్థాల నిర్వహణపై ప్రధానంగా చర్చించామన్నారు. వ్యర్థపదార్థాలతో విద్యుత్ ఉత్పత్తికి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశామన్నారు.
దేశంలోని వివిధ పట్టణాల్లో చెత్తను సేకరించి ప్లాంట్లకు చేరవేసే బాధ్యత ఆయా మున్సిపల్ అథారిటీలదేనన్నారు. స్వచ్ఛ భారత్ కోసం 75:25 నిష్పత్తిలో కేంద్రం, రాష్ట్రాలు నిధులు కేటాయించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. గ్రామస్థాయి నుంచి కేంద్రం వరకు స్వచ్ఛభారత్ మిషన్లు ఏర్పాటు చేస్తామన్నారు.
చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కర్ణాటక, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, మిజోరం రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. స్వచ్ఛభారత్పై ముసాయిదా నివేదికకు ఉపకమిటీ తుదిరూపు ఇచ్చి ఆమోదించనుంది.
2019 నాటికి స్వచ్ఛభారత్ను నిర్మిస్తాం: వెంకయ్య
2019 నాటికి స్వచ్ఛభారత్ను నిర్మిస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛ భారత్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరముందన్నారు. ఈరోజు ఉదయం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తన నివాసంలో అల్పాహార విందు ఇచ్చారు.
స్వచ్ఛభారత్ సమావేశం దృష్ట్యా ఏపీ సీఎం చంద్రబాబు గ్రామీణ, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శుల అభిప్రాయం తీసుకున్నారని వెంకయ్య తెలిపారు. తమ భేటీలో రాజకీయపరమైన చర్చలు జరగలేదన్నారు. ఏపీలోని మూడు స్మార్ట్ సిటీల అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరుచేస్తుందని వెల్లడించారు.