అంచనాలు భారీగా పెంచారు: నితిన్ గడ్కరీ, చంద్రబాబు వివరణ, పోలవరం సందర్శన వివరాలు
Recommended Video
పశ్చిమగోదావరి: 2019 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. బుధవారం సాయంత్రం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతోపాటు ఆయన పోలవరం సందర్శించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని కేంద్రమంత్రికి చంద్రబాబు వివరించారు.
2019లక్ష్యంగా..
వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి కాంక్రీట్ పనులన్నీ పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఏప్రిల్ కల్లా అన్ని మెజార్టీ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. 2019, డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. డీపీఆర్2ను కూడా త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను కోరామని చెప్పారు.
పోలవరంకు 57వేల కోట్లు
ప్రాజెక్టు భూసేకరణ కోసం 33వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని చంద్రబాబు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి తెలిపారు. సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 57,940కోట్లు అవసరమవుతుందని చెప్పారు. 2013 చట్టం ప్రకారం అంచనాలు పెరిగాయని తెలిపారు.
ఏపీకే కాదు దేశానికే కీలక ప్రాజెక్టు
అనంతరం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. పోలవరం కేవలం ఆంధ్రప్రదేశ్కే కాదు దేశానికే కీలక ప్రాజెక్టు అని అన్నారు. పోలవరం పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. మరింత వేగం పెంచాలని కోరారు.
ఏపీ రైతులకు కొత్త జీవితాలు
పోలవరం ప్రాజెక్టుతో ఏపీ రైతులకు కొత్త జీవితాలు ఏర్పడతాయని కేంద్రమంత్రి అన్నారు. పనులు పూర్తి చేసేందుకు కొన్నినిధులు ముందే చెల్లించాలని చంద్రబాబు కోరారని.. భూసేకరణ, పరిహారం కోసం నిధులు ముందే చెల్లించాలంటే ఆర్థిక శాఖ అనుమతి అవసరమని చెప్పారు. నిధులు త్వరగా విడుదల చేసేలా ఆర్థిక శాఖను కోరతామని చెప్పారు.
రాజకీయాలకు తావులేదు
భూసేకరణ, పరిహారం ఖర్చు దాదాపు రెట్టింపు అయ్యిందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పెరిగిన ప్రాజెక్టు అంచనాలను ఆర్థిక శాఖకు పంపిస్తామని చెప్పారు. తాను పోలవరం రావడం ఇది రెండోసారి అని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. ప్రాజెక్టును పూర్తి చేసే విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావులేదని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.
అంచనాలు భారీగా పెంచారు
కేంద్ర, రాష్ట్ర అధికారులు మూడు రోజులపాటు ఇక్కడే మకాం వేసి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ కట్టుబడి ఉన్నారని చెప్పారు. ప్రాజెక్టు అంచనాలను భారీగా పెంచారని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మరోసారి వ్యాఖ్యానించారు. అంచనాల పెరుగుదలతోపాటు సేకరించే భూమి కూడా ఎందుకు పెరుగుతోందని ప్రశ్నించారు. అంచనాల పెరుగుదలపై సమీక్షించాల్సి ఉందని అన్నారు. నిధుల ఆలస్యం కేవలం టెక్కికల్ సమస్యేనని అన్నారు.
చంద్రబాబు వివరణ
సీఎం చంద్రబాబు కోరినట్లు ముందుగానే నిధులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ప్రాజెక్టు పనుల వేగం మరింత పెంచాలని సూచించారు. అభివృద్ధికి రాజకీయాలు అడ్డుకాకూడదని స్పష్టం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ.. భూసేకరణ, ఆర్ఆర్ల అంచనాలు 2013-14 చట్టం ప్రకారం అంచనాలు పెరిగాయని వివరణ ఇచ్చారు.