కిరణ్ రెడ్డిపై చర్యలుండవు, తప్పించం: దిగ్విజయ్
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని పదవి నుంచి తప్పిస్తారనే వార్తలను కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ తోసిపుచ్చారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డిని పదవి నుంచి తప్పిస్తారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కిరణ్ కుమార్ రెడ్డిపై ఏ విధమైన చర్యలుండవని ఆయన స్పష్టం చేశారు.
సంక్లిష్టమైన విభజన అంశాన్ని క్రమశిక్షణతో ముడిపెట్టి కఠినంగా వ్యవహరించదలుచుకోలేదని ఆయన స్పష్టం చేశారు. తాను ఇది వరకే ఈ విషయం చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. కేంద్ర మంత్రి వర్గం రాష్ట్ర విభజన బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత ఆయన శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడారు.

సవరణలతో బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు తాను కూడా ఇప్పుడే ప్రసారమాధ్యమాల్లో చూశానని ఆయన అన్నారు. కొత్త రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు పలుకుతూ ఇదివరకు లేఖలు ఇచ్చిన పార్టీలన్నీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలతో కూడిన బిల్లుకు పార్లమెంటులో మద్దతు పలకాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ చేసిన సవరణలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం బిల్లుకు కొన్ని సవరణలు ప్రతిపాదించిందని ఆయన చెప్పారు. తనపై వేటు వేసినా వెనక్కి తగ్గేది లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఈ జాతీయ టీవీ చానెల్ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు.












Click it and Unblock the Notifications