వైసీపీతో పొత్తు ప్రసక్తే లేదు, నాయకత్వానిదే నిర్ణయం: పురంధేశ్వరి
అమరావతి: భారతీయ జనతా పార్టీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతులు కలుపుతుందన్న ప్రచారంలో వాస్తవం లేదని బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి అన్నారు. జగన్తో కలిసి వెళ్లాలన్న ఆలోచన తమ పార్టీకి లేదని చెప్పారు.
పురంధేశ్వరి శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడారు. కేంద్రం, రాష్ట్రంలో తాము టీడీపీతో కలిసి ఉన్నామని చెప్పారు. టీడీపీతో తమ పొత్తు కొనసాగుతుందని చెప్పారు. పొత్తులపై ఢిల్లీలోని అధినాయకత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని పురంధేశ్వరి వ్యాఖ్యానించారు.
వైసీపీ కూడా ఎన్డీఏలో కలవబోతోందని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె ఆ విషయంపై స్పష్టతనిచ్చారు. ఇటీవల కాలంలో బిజెపితో వైసీపీ సన్నిహితంగా ఉంటుంది. దీంతో వైసీపీ ఎన్డిఏలో చేరబోతోందనే వార్తలు వచ్చాయి.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డిఏ అభ్యర్థికి వైసీపీ మద్దతిచ్చింది. ఈ తరుణంలో బిజెపితో వైసీపీ కలిసే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ తరుణంలోనే పురంధేశ్వరి చేసిన ప్రకటన రెండు పార్టీల శ్రేణుల్లో ఉన్న అనుమానాలను తీర్చింది.