గల్లంతైన విమానంపై నో క్లూ, అది పాతదా: గతంలో ప్రమాదాలు..
హైదరాబాద్: మన వైమానిక దళంలోని యుద్ధ విమానాలు పాతబడిపోయాయా? ఆధునికీకరణ చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. తరుచూ ప్రమాదాలు జరగడమే అందుకు నిదర్శనం అంటున్నారు.
మన వైమానిక సాయుధ సంపత్తిలో దాదాపు 70 శాతం రష్యా ఆధారితం. తాజాగా గల్లంతైన ఏఎన్ 32 నుంచి సుఖోయ్-30 వరకు చాలా రష్యా నుంచి దిగుమతి చేసుకున్నవే. గత 45 ఏళ్లలో భారత్లోని 872 మిగ్ విమానాలలో 482 ప్రమాదాలకు గురయ్యాయి. 210 మంది మృతి చెందారు.
రెండు రోజుల క్రితం గల్లంతైన ఏఎన్ 32 విమానం 32 ఏళ్ల కిందడ కొనుగోలు చేసింది. కొరియర్ ఎయిర్ క్రాఫ్ట్గా పని చేస్తున్న ఇది రెండు రోజులకు ఒకసారి తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్లోని వాయుసేన స్థావరం ఐఎన్ఎస్ ఉత్క్రోష్కు వెళ్లి వస్తుంది.
ఇందులో రక్షణ పరికరాలు, నిపుణులు, ఆహారాన్ని తీసుకెళ్తుంటారు.ఇది రెండింజన్లు కలిగి ఉన్న విమానం. కాబట్టి ఓ దాంట్లో లోపం ఏర్పడినా మరో ఇంజిన్ పని చేస్తుంది. ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకుంటుంది. కానీ దీనికి కాలం చెల్లింది. ఇదిలా ఉండగా, ఏఎన్ 32 విమానం గల్లంతై మూడు రోజులు దాటినా ఇంకా ఆచూకి లభించలేదు. ఇప్పటి వరకు దాని గురించి క్లూ కూడా దొరకలేదు.
గతంలో ఏఎన్ 32 విమాన ప్రమాదాలు
భారత్లో గతంలోను ఏఎన్ -32 విమానాలు ప్రమాదాలకు గురయ్యాయి 1986 మార్చి 25న హిందూ మహాసముద్రం మీదిగా ఏడుగురితో వెళ్తూ ఏఎన్32 విమానం గల్లంతయింది. 1990 జూలై 15న చెన్నై తాంబరం నుంచి తిరువనంతపురం వస్తూ ఏఎన్ 32 విమానం ఒకటి కూలిపోయింది. 2009 జూన్ 10న అరుణాచల్ ప్రదేశ్లో ఓ ఏఎన్-32 విమానం కూలింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. ఇప్పుడు 29 మందితో కూడిన విమానం గల్లంతయింది.
చంద్రబాబు
అదృశ్యమైన భారత వాయుసేన విమానంలో ఉన్న విశాఖవాసుల కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం పరామర్శించారు.
చంద్రబాబు
గల్లంతైన ఎన్ఏడీ సిబ్బంది జాడ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
చంద్రబాబు
విశాఖలోని బుచ్చిరాజుపాలెంలో ఉంటున్న నమ్మి చిన్నారావు కుటుంబాన్ని కలిసినప్పుడు, తమ వాడిని వెంటనే తీసుకురండని చంద్రబాబును ప్రాధేయపడ్డారు. చంద్రబాబు వారికి ధైర్యం చెప్పారు.
చంద్రబాబు
విమాన ప్రమాదంపై చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ కుటుంబాల్ని చూస్తే బాధేస్తోందని, నేను పరామర్శించినవి రెండూ నిరుపేద కుటుంబాలేనని చెప్పారు.
చంద్రబాబు
ఈ కుటుంబాల్ని ఏవిధంగా ఆదుకోవాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చంద్రబాబు చెప్పారు. ఆ తర్వాత వేపగుంటకు చెందిన గంట్ల శ్రీనివాస్, సాంబమూర్తికి చెందిన బాధిత కుటుంబాలను విశాఖ విమానాశ్రయానికి పిలుపించుకొని చంద్రబాబు ధైర్యం చెప్పారు.