అవిశ్వాసం-గల్లా జయదేవ్: మోడీపై విమర్శకు మహేష్ బాబు సినిమా ప్రస్తావన
న్యూఢిల్లీ: కేంద్రంపై అవిశ్వాస తీర్మానం చర్చ ప్రారంభం సమయంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ భరత్ అనే నేను స్టోరీ లైన్ చెప్పారు. మాట నిలబెట్టుకుంటేనే నాయకుడు అని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ మాట తప్పారని విమర్శించారు. ఆయన మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను ప్రస్తావనతో ఆసక్తికరంగా చర్చను ప్రారంభించారు.
ముఖ్యమంత్రిగా ఉన్న తన తండ్రి చనిపోవడంతో విదేశాల నుంచి వచ్చిన భరత్ అనే యువకుడు, అనూహ్య పరిస్థితుల్లో డైనమిక్ సీఎంగా మారతారని పేర్కొన్నారు. తన తల్లి సూచనతో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, విశ్వసనీయతే ప్రధానంగా పనిచేయడం కథాంశంగా చిత్రం ఉంటుందన్నారు. ప్రభుత్వాలపై ప్రజలు పెట్టుకునే నమ్మకాన్ని ప్రతిబింబించడంతోనే ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచిందన్నారు. ప్రస్తుత పాలకుల్లో అటువంటి విశ్వసనీయత కనిపించడం లేదన్నారు. మోడీ ఆధ్వర్యంలో రాష్ట్రానికి ఏ విధమైన హామీ నెరవేరలేదని, ఆయన ఇచ్చిన మాటను తప్పారన్నారు.

కొత్త రాజధాని అమరావతికి రూ.43వేల కోట్లు అవసరమైతే రూ.1000 కోట్లు మాత్రమే ఇచ్చారని గల్లా అన్నారు. ఛత్రపతి శివాజీ విగ్రహానికి రూ.3వేల కోట్లు, సర్దార్ పటేల్ విగ్రహానికి రూ.3,500 వేల కోట్లు ఇచ్చారన్నారు. రాజధాని అమరావతి విగ్రహాల విలువ చేయదా అన్నారు. ఏపీకి ఇప్పటి వరకు ఇచ్చినవి విభజన చట్టంలో భాగంగా ఇచ్చినవే అన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షను మీరు సందిగ్ధంలో పడేశారన్నారు.
Recommended Video

పార్లమెంటులో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం అనేది జాతీయ సమస్య అన్నారు. చేసిన వాగ్ధానం నెరవేర్చకపోవడం గౌరం కాదన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం జాతీయ సమస్య అన్నారు. ఏపీ విషయంలో కాంగ్రెస్ పార్టీది అపరాధం అయితే, బీజేపీది మహాపరాధం అన్నారు.5 కోట్ల మంది ప్రజలకు ఇచ్చిన మాటను మోడీ నిలబెట్టుకోలేదని అన్నారు. ఇప్పుడు ఏపీ ఇష్యూ మొత్తం దేశానికే ఇష్యూగా మారిందన్నారు. ఇది బీజేపీ, టీడీపీ మధ్య యుద్ధం కాదని, ఇది ఆధిక్యతకు, నైతికతకు మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు. మోడీ పాలనకు, ఏపీ రాష్ట్రానికి మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు.












Click it and Unblock the Notifications