ఏకాభిప్రాయం నో, మనసు గాయపడిందని నన్నపనేని
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ అంశంపై శాసనమండలి బిఏసిలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో అసెంబ్లీ బిఏసి నిర్ణయానికి అనుగుణంగా నిర్ణయం ఉంటుందని ప్రకటించారు. అసెంబ్లీలో చర్చ తేదీలను బట్టి మండలిలోను చర్చకు నిర్ణయం తీసుకుంటారు. మండలి బిఏసి సమావేశం దాదాపు రెండు గంటలు సాగింది.
బిఏసి సమావేశం అనంతరం టిడిపి ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై జనవరి 23వ తేదీ వరకు సమయం ఉన్నందున సుదీర్ఘంగా చర్చించాలని సీమాంధ్ర ప్రాంత నేతలు, వెంటనే జరగాలని తెలంగాణ ప్రాంత నేతలు పట్టుబట్టారని చెప్పారు. ముసాయిదా బిల్లును అర్థం చేసుకునేందుకు సభ్యులకు కొంత సమయం పడుతుందన్నారు.

విభజన అంశం చాలా సున్నితమైనదని, సభలో ఎలాంటి వాతావరణం కనిపించిందో బిఏసిలోను అదే వాతావరణం కనిపించిందన్నారు. అసెంబ్లీలో క్లాజు వైజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంపూర్ణంగా చర్చించేందుకు అవకాశమివ్వాలన్నారు. మండలిలో బిల్లును ప్రవేశ పెట్టారని, చర్చ ప్రారంభించలేదన్నారు. చర్చ జరగాలని కొందరు, ఇప్పుడే వద్దని మరికొందరు చెప్పారన్నారు. అలాగే బిల్లుపై చర్చ తర్వాత ఓటింగ్ ఉంటుందా లేదా అనే అంశంపై చర్చించినట్లు తెలిపారు.
చర్చకు కొంత సమయమివ్వాలన్నారు. ఇప్పటికిప్పుడు వెంటనే చర్చించాలనడం సరికాదన్నారు. సభ్యులు క్లాజుల వారీగా బిల్లును అర్థం చేసుకోవాలన్నారు. సామరస్య పూర్వక వాతావరణంలో చర్చ జరగాలని పలువురు సభ్యులు కోరినట్లు తెలిపారు. బిల్లులోని ప్రతి అంశంపై ఓటింగ్ జరగాలని వ్యక్తిగతంగా తాను కోరినట్లు చెప్పారు.
మనసు గాయపడింది: నన్నపనేని
విభజన జరగకముందే ఇలా ఉంటే జరిగాక ఎలా ఉంటుందని నన్నపనేని రాజకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నటి ఘటనపై సహచర సభ్యులు క్షమాపణలు చెప్పారని, దానిని తాము పొడిగించదల్చుకోలేదన్నారు. అయితే విభజన తర్వాత ఎలా ఉంటుందనేదే తమ ఆందోళన అన్నారు. తనకు భౌతికంగా ఎలాంటి గాయాలు కానప్పటికీ మనసుకు మాత్రం గాయమైందన్నారు.












Click it and Unblock the Notifications