ఆఫ్టరాల్ అన్లేదు: పవన్ కళ్యాణ్కు రావెల, కెసిఆర్ లిక్కర్తో బాబుకు ఆర్థిక కష్టం!
గుంటూరు: ఆంధ్రప్రదశ్ రాజధాని భూసేకరణ విషయంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి రావెల కిషోర్ బాబు శుక్రవారం అన్నారు. తెలుగుదేశం పార్టీకి - జనసేనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు.
ఏపీ రాజధాని భూసేకరణ విషయంలో తానేమీ అనుచితంగా వ్యాఖ్యానించలేదన్నారు. భూములు ఇవ్వని రైతులను ఉద్దేశించి తాను ఆఫ్టరాల్ అనలేదని వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను పవన్ వక్రీకరించారన్నారు.తాను మాట్లాడిన విషయాలను ఆయన సరిగా అర్థం చేసుకోలేదన్నారు. పవన్ కల్యాణ్ అంటే తనకు గౌరవమన్నారు.
ఆయన మంగళగిరి ఎస్సీ హాస్టల్ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. హాస్టల్ విద్యార్థులకు ఐఏఎస్ శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. వసతి గృహంలో సిబ్బంది లేకపోవడంపై మండిపడ్డారు. వార్డెన్ సహా నలుగురిని సస్పెండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నామమన్నారు.
టిడిపి నేతలు మభ్యపెడుతున్నారు: జగన్
ప్రత్యేక హోదాకు, ప్రత్యేక ప్యాకేజీకి తేడా లేదని ప్రజలను మభ్య పెట్టేందుకు టిడిపి ప్రయత్నాలు చేస్తోందని వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వద్ద చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదని ఆరోపించారు. నిరుద్యోగ భృతి అన్న ఎన్నికల హామీ ఏమయిందని ప్రశ్నించారు.
ఏపీ రాజధాని ప్రాంతంలో చెట్ల పెంపకానికి ప్రభుత్వం చర్యలు
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రాంతంలో చెట్ల పెంపకానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హెలికాప్టర్ ద్వారా రాజధాని ప్రాంతంలో విత్తనాలు చల్లే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం జెండా ఊపి ప్రారంభించారు.
తెలంగాణ లిక్కర్ పైన ఏపీ సమీక్ష
తెలంగాణలో ప్రవేశ పెట్టనున్న చీప్ లిక్కర్ తమ రాష్ట్రంలోని మద్యం అమ్మకాల పైన ప్రభావం చూపకుండా ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది. ఇందుకోసం తెలంగాణ సరిహద్దు గల జిల్లాల పైన దృష్టి సారించింది.
తెలంగాణలో 90 మిల్లీ లీటర్ల మద్యాన్ని రూ.15కే అందుబాటులోకి తేనున్నారు. ఈ విధానం అక్టోబర్ నెల నుంచి ప్రారంభం కానుంది.
తెలంగాణలో చీప్ లిక్కర్ తక్కువకు దొరికితే ఆ మద్యం సరిహద్దు రాష్ట్రాల్లోకి ప్రవేశించి అవకాశాలు ఉంటాయి. అదే జరిగితే ఏపీలో మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంపై ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ చీప్ లిక్కర్ రాష్ట్రంలోకి రాకుండా చూసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.