పిరికి పందలు: కిరణ్ రెడ్డిపై పరోక్షంగా రఘువీరా
హైదరాబాద్: ఏ పరిస్థితుల్లోనైనా కాంగ్రెస్ పార్టీని వీడేవారు పిరికి పందలేనని ఆ పార్టీ సీనియర్ నాయకుడు రఘువీరా రెడ్డి మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. మీరు చేసిన వ్యాఖ్యలు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించినవేనా అని మీడియా ప్రశ్నించగా.. తన వ్యాఖ్యలు అందరికీ వర్తిస్తాయని అన్నారు. రాష్ట్ర విభజనకు రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీలు మొదటగా అనుకూలంగా ఉన్నందునే కాంగ్రెస్ పార్టీ చివరగా నిర్ణయం తీసుకుందని తెలిపారు.
రాష్ట్ర విభజన వల్ల తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు గానీ, మరే ఇతర పార్టీల నాయకులు గానీ పార్టీలు విడిచి వెళుతున్నారా అని రఘువీరారెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అన్నారు. విభజనకు అంగీకరించి తర్వాత యూటర్న్ తీసుకున్న పార్టీలన్నీ కాంగ్రెస్ పార్టీని వంచించాయని ఆయన ఆరోపించారు.
రాష్ట్ర విభజనలో అన్ని పార్టీలకు భాగస్వామ్యం ఉందని రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. విభజనపై కాంగ్రెస్ చిట్ట చివరగా నిర్ణయం తీసుకుందని, అలాగే ఇందులో కాంగ్రెస్ తప్పులేదని చెప్పడంలేదన్నారు. ఓట్లు కోసం, సీట్ల కోసం తమ ఒక్కరినే బాధ్యులను చేయడం సబబు కాదని ఆయన అన్నారు. తాను కాంగ్రెస్లోనే కొనసాగుతానని రఘువీరా తేల్చిచెప్పారు.
రాయపాటి పార్టీలో ఉండాలని కోరుకుంటున్నా, కిరణ్పై సెటైర్: డొక్క
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రెస్మీట్లు మాత్రమే పెడతారని, పార్టీ పెట్టరని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఆయన పార్టీ పెడితే సొంత జిల్లా చిత్తూరు నుంచి ఒక్క ఎమ్మెల్యే అయినా వస్తారో లేదో ఆలోచించుకోవాలని అన్నారు. పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని తాను కోరుకుంటున్నట్లు ఆ పార్టీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపి లగడపాటి రాజగోపాల్ లాంటి నేతలు తమ వద్ద చివరి బంతి, బాంబు, ఆస్త్రాలున్నాయని చెప్పడంతో రాయపాటి నమ్మారని తెలిపారు.
తన రాజకీయ గురువైన రాయపాటి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని కోరుకుంటున్నట్లు, ఈ విషయంపై అధిష్టానంతో చర్చలు జరుపుతున్నానని తెలిపారు. గుంటూరు జిల్లాలోని కాంగ్రెస్ కార్యకర్తలు కూడా రాయపాటి పార్టీలో కొనసాగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.