కెసిఆర్కు భయపడం: చిరంజీవి, అనుభవంతో..: డిఎస్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు ప్రచార కమిటీ అధ్యక్షులు చిరంజీవి గురువారం అన్నారు. భద్రాచలం డివిజన్ను ఆంధ్రా ప్రాంతంలో కలిపేందుకు కెసిఆర్ తమ పార్టీ అధిష్టానం వద్ద ఒప్పుకున్నారని చెప్పారు. ఓట్లు దండుకోవడం కోసమే కెసిఆర్ విమర్శలు చేస్తున్నారన్నారు.
కార్యకర్తలలో నూతన ఉత్సాహం నింపేందుకు తాము జిల్లాల పర్యటన చేపడుతున్నామన్నారు. కాంగ్రెసు పార్టీని వేలెత్తి చూపుతున్న ప్రతి ఒక్కరు ఎన్నికల్లో తమకు ప్రత్యర్థులే అన్నారు. ఉమ్మడి రాజధాని ఉన్నచోట గవర్నర్ పాలనలో ఇబ్బందులు ఉండవని చెప్పారు. ఉమ్మడి రాజధానిలో అందరికీ రక్షణ ఉంటుందన్నారు. కేంద్రం నుంచి వచ్చే అన్ని అవకాశాలు తాము వినియోగించుకుంటామని చెప్పారు.
విభజనకు కాంగ్రెసు ఓక్కటే కారణం కాదని ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే సంప్రదాయం కాంగ్రెసు పార్టీకి లేదన్నారు. కెసిఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడమని, ఉమ్మడి రాజధానిలో సీమాంధ్రులను ఎవరూ ఏమీ చేయలేరన్నారు. రేపు శ్రీకాకుళం జిల్లా నుండి బస్సుయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు.
పూర్వ వైభవం తీసుకొస్తాం: కాసు
సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెసు పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తామని మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణా రెడ్డి అన్నారు. కాంగ్రెసు పార్టీ గతంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొందని చెప్పారు. పదవుల కోసం నేతల ఉరుకులు, పరుగులు చూస్తుంటే రాజకీయాలపై అసహ్యం వేస్తోందన్నారు. ఆయన గుంటూరు జిల్లాలో మాట్లాడారు.
హక్కు లేదు: విహెచ్
కెసిఆర్కు కాంగ్రెసు పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు అన్నారు. టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడిది నకిలీ రామబాణం అన్నారు. రాజ్యసభ సీటు కోసమే కెకె పార్టీ మారారని ధ్వజమెత్తారు. అన్నం పెట్టే వారికి సున్నం పెట్టే వ్యక్తి కెకె అన్నారు.
అనుభవంతో చెబుతున్నా...: డిఎస్
తాను అనుభవంతో చెబుతున్నానని పొత్తులకు వ్యతిరేకం కాదని పిసిసి మాజీ చీఫ్ డి శ్రీనివాస్ అన్నారు. తెరాసతో పొత్తు విషయం అధిష్టానం నిర్ణయిస్తుందని, వారి నిర్ణయాన్ని తాము శిరసా వహిస్తామన్నారు.