హైదరాబాద్ నుంచి వచ్చే ఉద్యోగులే భరించాలి : ఉచిత వసతి నిలిపివేత : ఏపీ ప్రభుత్వం నిర్ణయం..!!
ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు సచివాలయంతో పాటుగా హెచ్ఓడీల్లో ప్రధాన చర్చకు కారణమైంది. రాష్ట్ర విభజన తరువాత అమరావతికి ఏపీ రాజధాని తరలించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగులను వెంటనే అమరావతికి తరలించటం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా సచివాలయం..శాఖల ప్రధాన కార్యాలయాల్లో పని చేస్తున్న ఏపీ ఉద్యోగులకు కొంత కాలం వసతి కల్పిస్తామని ముందుకొచ్చారు. వారి కోసం నాగార్జున యూనివర్సిటీ సమీపంలో వసతి కల్పించారు. ప్రభుత్వమే వారి వసతి ఖర్చు భరించింది.
అయితే, అప్పట్లో తాత్కాలికంగానే ఆ ఉపశమనం ఇవ్వనున్నట్లు చెప్పింది. అయితే, అప్పటి నుంచి ఇప్పటికీ అదే విధానం కొనసాగుతోంది. ప్రభుత్వం మారిన తరువాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నారేళ్ల కాలంలోనే ప్రభుత్వమే వారికి ఉచిత వసతి కొనసాగిస్తోంది. అయితే, ఈ రోజున ప్రబుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అందులో నవంబర్ 1 తేదీ నుంచి ఉద్యోగులు, ఉద్యోగినులు ఎవరి వసతి వారు సొంత ఖర్చులతో భరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం 2021 ఆగస్టు నుంచి ఆక్టోబరు 31 తేదీ వరకూ మాత్రమే ఉచిత ట్రాన్సిట్ వసతిని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అక్టోబరు 31 తేదీ అనంతరం ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత ట్రాన్సిట్ వసతిని నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేసిన ప్రభుత్వం..ఉద్యోగులకు ముందస్తు సమాచారం ఇచ్చింది. వీరిలో సచివాలయం, శాసన పరిషత్, హెచ్ఓడీ కార్యాలయాల్లో పనిచేస్తున్న పురుష, మహిళా ఉద్యోగులకు ఇప్పటి వరకూ షేరింగ్ ప్రాతిపదికన ఉచిత వసతి కల్పించిన ప్రభుత్వం ఇక నుంచి వారికే ఆ బాధ్యతలు అప్పగించింది. 2021 నవంబరు 1 తేదీ నుంచి ఉద్యోగులెవరికీ ఉచిత వసతి వెసులుబాటు ఉండబోదని స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
అయితే, కొద్ది రోజుల క్రితం మూడు రాజధానుల నిర్ణయంలో భాగంగా సచివాలయంతో పాటుగా ప్రధాన కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు విశాఖ తరలి వెళ్లాల్సి ఉంటుందని ప్రచారం సాగింది. అయితే, న్యాయ పరంగా ఆ నిర్ణయం ఇంకా అమలు కాలేదు. ఇదే సమయంలో ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి దాదాపు అయిదేళ్ల పాటు ఉచిత వసతి కల్పించా మని..ఇక, ఉద్యోగులే ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్పినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి విజయవాడ కు వచ్చే ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఎంప్లాయిస్ రైలు కూడా ఏర్పాటు చేసారు. ఇప్పటికీ అది కొనసాగుతోంది. దీంతో..ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పైన ఉద్యోగ సంఘాలు...నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతారో చూడాలి.