జగన్ ఢిల్లీ పర్యటన ఎఫెక్ట్: చంద్రబాబు, కేసీఆర్ ఇరకాటంలో పడ్డారా?
హైదరాబాద్: ఏపీ, తెలంగాణలలో నియోజకవర్గాల సంఖ్య భారీగా పెరుగుతాయని పార్టీలోకి వచ్చిన వారందరికీ పదవులు లభిస్తాయని చెబుతూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు 'ఆపరేష్ ఆకర్ష్'కు తెరలేపారు. అయితే ఈ నియోజకవర్గాల పెంపునకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
అంతేకాదు నియోజకవర్గాల పెంపునకు సంబంధించి ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు కనిపించడం లేదు. దీనికి సంబంధించిన అటార్నీ జనరల్ తన అభిప్రాయంపై తీవ్ర జాప్యం చేస్తున్నందున బిల్లును సిద్ధం చేయలేకపోతున్నట్లు కేంద్ర న్యాయశాఖ అధికారులు చెబుతున్నారు.
ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెంచుకునేలా విభజన చట్టంలో వెసులుబాటు కల్పించారు. అయితే, దీనికి న్యాయపరంగా కొన్ని చిక్కులు తలెత్తినట్లు సమాచారం. నియోజకవర్గాల పునర్విభజనను 2026లో చేపట్టాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3) సూచిస్తోంది.
దీని వల్ల విభజన బిల్లు సవరణతో ఒరిగేదేమీ లేదని హోంశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే, విభజన బిల్లును రాజ్యాంగంలోని ఆర్టికల్ 3, 4 ప్రకారం ప్రవేశపెట్టినందున కొన్ని సెక్షన్ల ప్రభావం పడకుండా ఆర్టికల్ 4లోని కొన్ని నిబంధనలు నియోజక వర్గాల పెంపు బిల్లుకు అనకూలంగా ఉందని నేతలు చెబుతున్నారు.
ఈ మేరకు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే నియోజకవర్గాల పెంపు బిల్లుని ప్రవేశపెట్టాలని ఒత్తిడి తెస్తున్నారు. దీనికి సంబంధించి సభా వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, హోంమంత్రి రాజ్నాధ్తో పలుసార్లు భేటీ అయ్యారు. దీనిపై అభిప్రాయం కోరుతూ న్యాయశాఖకు హోంశాఖ ఫైల్ను పంపారు.
అయితే ఈ ఫైల్ను అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ఇప్పటి వరకు చూడలేదు. ప్రస్తుతం ఆయన బిజీగా ఉండటంతో ఆయన అభిప్రాయం అందిన తర్వాత ఫైల్లో నమోదుచేసి, హోంశాఖకు పంపుతామని న్యాయశాఖ వర్గాలు అంటున్నాయి. వచ్చే సమావేశాలనాటికైనా ఈ బిల్లును సిద్ధం చేస్తామని హోంశాఖ వర్గాలు అంటున్నాయి.
విభజన చట్టంలో ఏపీకి ప్రత్యేకహోదా అనే అంశం లేదని ఇప్పుడు ప్రత్యేకహోదా ఇవ్వలేమని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి సిన్హా లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా అంశంనుంచి దృష్టి మరల్చేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టాలని భావించినా అనివార్య కారణాలతో జాప్యమవుతోందని బీజేపీ నేతలు చెబుతున్నారు. కాగా, నియోజకవర్గాల పెంపు కారణంగానే వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఫిరాయిస్తున్నారని, ఎలాగైనా దీన్ని వాయిదా వేయాలని వైసీపీ అధినేత జగన్ ఇటీవల ఢిల్లీలోని బీజేపీ నేతలందరికీ విజ్ఞప్తి చేశారు.
ఈ విషయాన్ని కూడా ఢిల్లీలోని బీజేపీ నేతలు దృష్టిలో పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుత సమావేశాల్లో బిల్లు పెట్టడంపై కేంద్రం పునరాలోచనలో పడిందని టీడీపీ, టీఆర్ఎస్ ఎంపీలు కొందరు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అటార్నీ జనరల్గా ఉన్న ముకుల్ రోహత్గీ గతంలో జగన్ కేసులను వాదించారు.
ఈ క్రమంలో వైయస్ జగన్ ఒత్తిడి కూడా ఈ బిల్లను పార్లమెంట్కు రాకుండా పని చేసి ఉంటుందని టీడీపీ ఎంపీలు ఆరోపిస్తున్నారు. 2019 ఎన్నికల వరకు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు లేకపోతే ప్రస్తుతం ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న అధికార పార్టీలైన టీడీపీ, టీఆర్ఎస్ చిక్కుల్లో పడతాయని అంటున్నారు.