ఇక బీసీలకు ఉద్యోగాలు రానట్టే, పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిందే: ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య
కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై బీసీ సంఘం జాతీయాధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఈ నిర్ణయంపై బీసీ సంఘం జాతీయాధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంచలనం: కాపులకు 5 శాతం రిజర్వేషన్, ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు...
కాపు రిజర్వేషన్: విద్యా, ఉపాధి రంగాల్లో మాత్రమే, మంజునాథన్ కమిషన్ నివేదిక ఏం చెప్పిందంటే..
ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకుని, బీసీల అవకాశాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. బీసీ జాతికి విలువ లేకుండా పోతుందని వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు దీన్ని గట్టిగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
70 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఇప్పటికీ చాలా మంది బీసీలకు ఉద్యోగాలు దొరకడం లేదని అన్నారు. ఒకవేళ కేబినేట్ తీసుకున్న నిర్ణయాన్ని అమల్లోకి తెస్తే నిజమైన బీసీలకు ఒక్కరికి కూడా ఉద్యోగం రాదని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక బీసీ నాయకులు ఉద్యమించాల్సిన అవసరం ఆసన్నమైందని, పెద్ద ఎత్తున నాయకులు ఉద్యమించడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే కృష్ణయ్య డిమాండ్ చేశారు.