జగన్ ఎంత కసిగా ఉన్నారంటే..అలా చేస్తే మొనగాళ్లమవుతామా: మంత్రులకు చెమటలు..!
స్థానిక సంస్థల ఎన్నికలపైన మంత్రులకు సీఎం జగన్ అల్టిమేటం జారీచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంత్రుల నియోజకవర్గాల్లో వైసీపీ మంచి ప్రదర్శన ఇవ్వకపోతే నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి రాజీనామా చేయాల్సిందే అని మంత్రులతో ఘాటుగా చెప్పినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతంకు పైగా గెలవాలని మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు.

ఐదుగురు సీనియర్ నేతలకు బాధ్యతలు
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ఐదుగురు సీనియర్ నేతలకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాలను చూసుకొంటారని సమాచారం. మరో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి నెల్లూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల బాధ్యతలను అప్పజెప్పగా.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉభయ గోదావరి జిల్లాలను చూసుకుంటారు. సీఎం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిత్తూరు, అనంతపురం జిల్లాలను, అయోధ్యరామిరెడ్డి గుంటూరు, కృష్ణా జిల్లాలను పర్యవేక్షిస్తారు.

పార్టీ నుంచి నగదు పంపిణీకి ఎలాంటి సాయం ఉండదు
ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించాలని సీఎం సూచించారు. నియోజకవర్గాల్లో ఇంటింట ప్రచారం చేయాలని చెప్పారు. నగదు పంపిణీకి పార్టీ నుంచి ఎలాంటి సాయమూ ఉండదని కరాఖండిగా చెప్పేశారు జగన్. ఎన్నికల ప్రచార సామగ్రిని మాత్రమే పార్టీ పంపిణీ చేస్తుందని స్పష్టం చేశారు. గెలిచే అభ్యర్థుల ఎంపికతోనే 80 శాతం విజయం సాధించినట్లు అవుతుందని చెప్పిన జగన్... పార్టీ ఇప్పటికే సర్వేను చేపట్టి గెలుపు గుర్రాలను గుర్తించిందని అన్నారు. ఇన్చార్జి మంత్రులు, జిల్లాల్లోని ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ .. అభ్యర్థుల విషయంలో నిర్ణయం తీసుకుందామని చెప్పారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు .. మంత్రులు.. ఇతర నేతలు సమన్వయంతో పార్టీ అభీష్టానికి అనుగుణంగా నడుచుకోవాలంటూ సీఎం ఆదేశించారు.

అలాచేస్తే.. మొనగాళ్లమవుతామా?
ఎన్నికల సమయంలో మద్యం దుకాణాలు మూసేస్తే సరిపోతుందని ఇద్దరు మంత్రులు అభిప్రాయపడ్డారు. మద్యం దుకాణాలు మూసేసి పంపిణీ జరగకుండా చేసి మొనగాడనిపించుకుందామా? మద్యం దుకాణాలు ఉన్నా.. పంపిణీ చేయకుండా నిరోధించగలిగితేనే ప్రభుత్వ సామర్థ్యం తెలుస్తుంది అంటూ ఆ మంత్రులకు జగన్ చురకలంటించారు.
Recommended Video


ఏకగ్రీవాలకు ప్రాధాన్యత ఇవ్వండి
స్థానిక సంస్థలలో వీలైనన్ని ఏకగ్రీవాలు ఉండేలా చూద్దామని మంత్రులకు సీఎం సూచించారు. "ఏకగ్రీవాలు కావాలంటే, ఎన్నికల నుంచి తప్పుకునేవారు ఏదో ఒకటి ఆశిస్తారు కదా అని మంత్రి కొడాలి నాని అన్నారు. అలాంటిదేమీ ఉండదబ్బా. ఏకగ్రీవాలను చేయడానికి స్థానిక పరిస్థితులు కలిసి వస్తాయి. డబ్బులు, పదవుల ఆశ చూపాల్సిన పనిలేదు" అని అన్నారు.












Click it and Unblock the Notifications