తుపాకి కొనాల్సిన అవసరం నాకు లేదు, రాజకీయ కుట్ర: శ్రీరాములు
అనంతపురం: తుపాకి కొనుగోలు చేయాల్సిన అవసరం తనకు లేదని కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి పార్లమెంటు సభ్యుడు బి. శ్రీరాములు స్పష్టం చేశారు. శుక్రవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు. అసాంఘిక కార్యకలాపాల్లో తాను ఏనాడు కూడా పాలు పంచుకోలేదని ఆయన అన్నారు.
రాజకీయ కుట్రలో భాగంగానే అనంతపురం జిల్లా పోలీసులు తనపై నమోదు చేశారని ఆయన విమర్శించారు. బళ్లారిలో అక్రమంగా ఆయుధాలు విక్రయిస్తున్న ఓ ముఠాను రెండు రోజుల క్రితం అనంతపురం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా నుంచి ఎంపి శ్రీరాములు తుపాకి కొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఈరోపణలను శ్రీరాములు తోసిపుచ్చారు.
అనంతపురం జిల్లా ఎస్పీ రాజశేఖర బాబు ఆ ముఠాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బళ్లారిలో తుపాకీ కొనుగోలు చేసి తీసుకెళ్తున్న ధర్మవరానికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి దోస్తి పుల్లారెడ్డి, రామగిరి మండలం ఇచ్చిరెడ్డికొట్టాల గ్రామస్తుడు కంసల భాస్కరాచారిని అనంతపురం రైల్వేస్టేషన్లో ఇటీవల త్రీటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద 9 ఎంఎం పిస్తోల్, ఒక ఖాళీ మ్యాగ్జైన్ స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన వారు ఇచ్చిన సమాచారంతో ఉరవకొండ మండలం పెద్దముషఉ్టరు గ్రామానికి చెందిన కంద్యాల కుమార్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతను అక్రమంగా దాచి ఉంచిన రివ్వాలర్ను స్వాధీనం చేసుకున్నారు. గతంలో సూడో నక్సల్ గ్రూపులో పనిచేసి మృతి చెందిన కమ్మ గోపాల్ అలియాస్ రంగారెడ్డికి కంద్యాల కుమార్ మేనల్లుడు. వీరితో పాటు బళ్లారిలో దోస్తి పుల్లారెడ్డికి పిస్తోల్ విక్రయించిన రంగారెడ్డి అనుచరుడు చలిచీమల సూర్యనారాయణను అరెస్టు చేశారు.
రంగారెడ్డి సూచనతో కంద్యాల కుమార్ 2002లో ఒక తుపాకీ అందజేసినట్లు నిందితులు విచారణలో వెల్లడించారు. దీనిపై విచారణ కొనసాగుతోందని, ఆ ఆయుధం స్వాధీనానికి న్యాయపరంగా ముందుకెళ్తామని ఎస్పీ రాజశేఖర్బాబు తెలిపారు. ఈ ముఠా వద్ద మరో తుపాకీ కొనుగోలు చేసిన అనంతపురం వ్యాపారి సుధాకర్ నాయుడు వద్ద గతంలో డ్రైవర్గా పనిచేసిన సుంకన్న కోసం గాలిస్తున్నామన్నారు.
బళ్లారి కేంద్రంగా గతంలో వివిధ అక్రమాలకు పాల్పడిన సూడో నక్సల్ కమ్మ గోపాల్ అలియాస్ రంగారెడ్డి మృతి చెందక ముందు అతని వద్ద దాచుకున్న వివిధ రకాల తుపాకుల మరమ్మతులను కంసల భాస్కరాచారి ద్వారా రంగారెడ్డి అనుచరుడైన సూర్యనారాయణ చేయించేవాడు. రంగారెడ్డి మృతి సమయంలో సూర్యనారాయణ వద్ద మిగిలిపోయిన కొన్ని తుపాకుల్లో రెండింటిని రహస్యంగా విక్రయించాలని రంగారెడ్డి మేనల్లుడైన కంద్యాల కుమార్కు అందజేశాడు.
గతంలో బళ్లారి పోలీసులు కంద్యాల కుమార్ను అరెస్టు చేసి ఒక తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన మరో తుపాకీని తన స్వగ్రామం ఉరవకొండ మండలం పెద్దముషఉ్టరులో దాచి ఉంచారు. ఈ కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసిన అనంతపురం డీఎస్పీ మల్లికార్జునవర్మ, జిల్లా నిఘా విభాగం డీఎస్పీ సీఎం గంగయ్య, త్రీటౌన్ సీఐ పి.ఆంజనేయులు, ఎస్సైలను రెడ్డప్ప, తమీమ్ అహ్మద్, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.