అసెంబ్లీలో మాటల యుద్ధం కాదు సమస్యలపై దృష్టి పెడదామన్న జనసేన ఎమ్మెల్యే రాపాక.. ఖుషీలో పవన్ ఫ్యాన్స్
రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి జనసేన నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఏపీ అసెంబ్లీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. జనసేన నుండి గెలిచినా ఏకైక ఎమ్మెల్యే అయిన ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్న వేళ అధికార వైసీపీ , ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఇక రాపోలు వరప్రసాద్ జనసేన సిద్దాంతాలను ప్రతిబింబించేలా మాట్లాడిన మాటలతో జనసైన్యం ఖుషీగా ఉన్నారు.
జనసేన కండువా ధరించి అసెంబ్లీలో ప్రత్యేకంగా కనిపించిన రాజోలు ఎమ్మెల్యే రాపాక
ఏపీలో ప్రభంజనం సృష్టిస్తుంది అనుకున్న జనసేన పార్టీ గడచిన ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఏకంగా జనసేన పార్టీ నుండి రెండు స్థానాల్లో పోటీ చేసిన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం ఓటమిపాలయ్యారు. కానీ తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుండి రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ నుండి విజయం సాధించి ఒకే ఒక్కడు గా నిలిచాడు.
పార్టీ మారతాడు అనుకున్నా మారనని జనసేన నుండి అసెంబ్లీలో రిప్రజెంట్ చేస్తానని ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన సిద్ధాంతాల మేరకు పని చేస్తానని చెప్పారు. ఇక అదే బాటలో ముందు నడుస్తున్న ఆయన అసెంబ్లీలో జనసేన కండువా ధరించి పవన్ పార్టీని రిప్రజెంట్ చేశారు.
మాటల యుద్ధం కాదు .. ప్రజా సమస్యల పరిష్కారం కావాలి అని మాట్లాడిన రాపాక వరప్రసాద్
రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన తర్వాత రాపాక వరప్రసాద్ అసెంబ్లీ సమావేశాల్లో చాలా బాగా మాట్లాడారని జనసేన వర్గాలు భావిస్తున్నాయి అసెంబ్లీలో ఫిరాయింపులపై వైసీపీ , టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సమయంలో రాపాక మాట్లాడారు. పాలక పార్టీ కానీ, ప్రతిపక్షం కానీ అసెంబ్లీలో మాటల యుద్ధం చెయ్యాల్సిన అవసరం లేదని ప్రజా సమస్యలపై యుద్ధం చెయ్యాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అర్ధవంతమైన చర్చ జరగాలని కోరారు.
కొత్తగా ఎన్నుకోబడిన అసెంబ్లీ స్పాకర్ తమ్మినేని సీతారాం కు అభినందనలు తెలిపారు. అసెంబ్లీలో ఉన్న అధికార పక్షానికి, ప్రతిపక్షానికి , ప్రతి సభ్యుడికీ సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. జనసేన పార్టీ నుండి అసెంబ్లీలో రిప్రజెంట్ చేసిన ఎమ్మెల్యే రాపాక అసెంబ్లీలో అర్ధవంతమైన చర్చలు చేస్తారని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని జనసైన్యంలో నమ్మకం కలిగింది.
పవన్ పార్టీని అసెంబ్లీలో రిప్రజెంట్ చేస్తున్న రాపాక .. సంతోషంలో జనసైన్యం
ప్రతి ఒక్కరితో భేషజాలు లేకుండా కలిసిపోయే రాపాక వరప్రసాద్ శైలి ,అందరు ఎమ్మెల్యేలతో కలివిడిగా ఉండే ఆయన స్వభావమే కాదు , ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన సిద్దంతాలతో ఆయన పని చేసే విధానం ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటుంది. పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో కాలు పెడతాడని భావించిన జనసేన ఫ్యాన్స్, నాయకులు జనసేన నుండి ఒకే ఒక్కడు రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ అసెంబ్లీలో అడుగుపెట్టిన వేళ ఆయన ప్రసంగం విని సంతోష పడుతున్నారు. కాసింత ఊరట పొందుతున్నారు.