మూడు రాజధానులపై మరో బిల్లు లేనట్లే ? మరో నిపుణుల కమిటీ- జగన్ ముందు ఆప్షన్లు ఇవే
ఏపీలో మూడు రాజధానుల బిల్లుల్ని ఉపసంహరించుకుంటూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తదుపరి ఏం జరగబోతోందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ముందు పలు ఆప్షన్లు కనిపిస్తున్నాయి. ఇందులో ఏదో ఒక ప్రత్యామ్నాయాన్ని జగన్ ఎంచుకోవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇందులో ప్రజాభిప్రాయ సేకరణతో పాటు పలు ఆప్షన్లు కనిపిస్తున్నాయి.

మూడు రాజధానుల బిల్లుల రద్దు తర్వాత
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం గతంలో తీసుకొచ్చిన రెండు బిల్లుల్ని హైకోర్టు నిలిపేసిన నేపథ్యంలో వాటిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్ధితి ప్రభుత్వానికి ఏర్పడింది. ఓవైపు హైకోర్టులో విచారణ సాగుతున్నప్పటికీ బిల్లులపై తీవ్ర వ్యతిరేకతతో పాటు సాంకేతిక కారణాలు కూడా తోడవడంతో దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్ధితి. దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం త్వరలో ఓ ప్రకటన చేయబోతోంది.

జగన్ ప్రకటనలో స్పష్టత
ఏపీలో మూడు రాజధానుల బిల్లులపై వెనక్కి తగ్గాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ .. ఆ తర్వాత అసెంబ్లీలో దీనిపై పూర్తి స్పష్టత ఇస్తానని మంత్రులకు చెప్పేశారు. దీంతో జగన్ ప్రకటన కోసం అంతా ఎదురుచూస్తున్నారు. మంత్రులు కూడా దీనిపై ఏమీ మాట్లాడలేని పరిస్దితి. దీంతో మంత్రులు కూడా మౌనం వహిస్తున్నారు. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం తమ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుల ప్రకారం రాజధానుల ఏర్పాటు సాధ్యం కానందున వీటిని వెనక్కి తీసుకుని ప్రత్యామ్నాయాలపై దృష్టిపెడుతున్నట్లు జగన్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోసారి ప్రభాభిప్రాయ సేకరణ
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు సందర్భంగా ప్రభుత్వం జీఎస్ రావు కమిటీతో పాటు బోస్టన్ గ్రూప్ సాయంతో రెండు వేర్వేరు ప్రజాభిప్రాయ సేకరణలు జరిపింది. ఇందులో మూడు రాజధానులకు అనుకూలంగా ప్రజలు తమ నిర్ణయం చెప్పారని ప్రభుత్వం చెప్పుకుంది. ఈ కారణంతోనే అసెంబ్లీలో బిల్లులు కూడా ప్రవెశపెట్టారు. ఇప్పుడు అసెంబ్లీలో ఈ బిల్లులు వెనక్కి తీసుకున్న తర్వాత మరోసారి ప్రజాభిప్రాయం తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో మరోసారి నిపుణుల కమిటీని నియమించి మరోసారి ప్రజాభిప్రాయం తీసుకుంటామని జగన్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కొత్త బిల్లు మాత్రం లేనట్లే
ఏపీలో మూడు రాజధానుల కోసం తెచ్చిన రెండు బిల్లుల్ని ప్రభుత్వం ఉపసంహరించుకుని, వాటి స్ధానంలో మరో కొత్త బిల్లును తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాంకేతిక ఇబ్బందులు లేకుండా కొన్ని మార్పులతో ఈ బిల్లు తీసుకొస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ప్రభుత్వంతో పాటు వైసీపీ వర్గాలు కూడా ఖండిస్తున్నాయి. మూడు రాజధానుల బిల్లుల స్ధానంలో కొత్త బిల్లును తెచ్చే అవకాశాలు లేవని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

జగన్ సర్కార్ ముందు ఆప్షన్లు ఇవే
మూడు రాజధానుల బిల్లులు ఉపసంహరించుకుంటున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముందు 4 ఆప్షన్లు కనిపిస్తున్నాయి. ఇందులో ఆప్షన్1 : న్యాయపరమైన చిక్కులు లేకుండా 3 రాజధానులకు కొత్త బిల్లు తీసుకురావడం, ఆప్షన్2 : సాంకేతికంగా 3 రాజధానులను ప్రస్తావించకుండా అధికార వికేంద్రీకరణ చేపట్టడం, ఆఫ్షన్3 : పూర్తిస్తాయి రాజధానిగా అమరావతి అని చెప్తూనే మిగతా ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పడం, ఆష్షన్4: పరిపాలనా రాజధాని విశాఖ అని చెప్తూనే అమరావతిలో పాలనా వ్యవహారాలు కొనసాగించడం వంటి ఆప్షన్లు కనిపిస్తున్నాయి. మరి ఇందులో ప్రభుత్వం దేన్ని ఎంచుకుంటుందో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications