ఏపీ సీఎం చంద్రబాబుకు నోటీసులు ఇవ్వొద్దు: టీ ప్రభుత్వ పెద్దలు
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుకు వాయిస్ టెస్ట్ నిర్వహించొద్దని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎస్ఎఫ్ఎల్) అధికారులకు ఆదేశాలు అందాయా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ వర్గాలు. చంద్రబాబుకు ఎలాంటి నోటీసులు ఇవ్వొద్దని ఎస్ఎఫ్ఎల్కు తెలంగాణలోని ప్రభుత్వ ఉన్నత వర్గాలు సూచించాయని తెలుస్తోంది.
చంద్రబాబు సీఎం స్ధాయి వ్యక్తి కాబట్టి నోటీసులు ఇచ్చినా, వాయిస్ టెస్ట్ చేసినా అది వివాదాస్పదమవుతుందని భావిస్తున్న తెలంగాణ పోలీసులు ఈ విషయంలో సంయమనంతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని ముందుగా ప్రభుత్వ పెద్దలతో చర్చించిన తర్వాతే వారి సూచనల ప్రకారం నోటీసులు జారీ చేయడం వంటివి చేయకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు నోటీసులు ఇవ్వనుందని, చంద్రబాబు అరెస్ట్ తప్పదని మీడియాలో వార్తా కథనాలు ప్రసారమవుతున్న నేపథ్యంలో ఆ ఆడియో టేపుల్లో ఉన్నది చంద్రబాబు గొంతేకాదని, మానిప్లేట్ చేశారని ఏపీ మంత్రులు ఎదురుదాడికి దిగిన సంగతి తెలిసిందే.
దీంతో ఓటుకు నోటు వ్వవహారంలో తీసుకునే ప్రతి నిర్ణయం చాలా పక్కాగా ఉండాలని తెలంగాణ పోలీసులు అప్రమత్తమైనట్లు సమాచారం. ఆడియోలో ఉన్నది చంద్రబాబు గొంతా, కాదా అన్నది ప్రస్తుతానికి అనవసరమని, ఆయనకు ఇప్పుడు ఎలాంటి నోటీసులు ఇవ్వొద్దని ఎస్ఎఫ్ఎల్ అధికారులను పోలీసు ఉన్నతవర్గాలు ఆదేశించినట్లు సమాచారం.
ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘వాయిస్ టెస్ట్ కోసం ఎవ్వరూ ఎస్ఎఫ్ఎల్కు రారు. వచ్చినా గొంతు మార్చి మాట్లాడుతారు. అవి కోర్టులో నిలబడవు' అని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు సంబంధించిన పాత ఆడియో క్లిప్పులు తెప్పించుకొని పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో చంద్రబాబు అసెంబ్లీలో, బహిరంగ సభల్లో మాట్లాడిన పలు ఆడియో క్లిప్పులు తెప్పించుకొని స్టీఫెన్సన్తో మాట్లాడినట్లు చెబుతున్న ఆడియో క్లిప్పుతో పరీక్షిస్తున్నారని సమాచారం.